అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా

అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
  • రెండు డోసులు వేసుకుని.. నెగటివ్ రిపోర్టు ఉంటే చాలు
  • నవంబర్ 8 నుంచి అమెరికాలో ఎంట్రీకి అవకాశం

వాషింగ్టన్: అంతర్జాతీయ ప్రయాణీకులపై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుని చేతిలో నెగటివ్ రిపోర్టు ఉంటే చాలు నవంబర్ 8 నుంచి అమెరికా వెళ్లిపోవచ్చు. విమానాల ద్వారానే కాకుండా సరిహద్దు ప్రాంతాల ద్వారా దేశంలోకి వచ్చేవారిపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. 
2020లో కరోనా ప్రభావం మొదలైన తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. భారత్, చైనా, బ్రెజిల్‌ తదితర 33 యూరప్‌ దేశాల వారికి నవంబర్‌ మొదటివారం ఆంక్షలు ఎత్తివేస్తామని సెప్టెంబర్‌ 20న అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో కచ్చితమైన తేదీ ప్రకటించలేదు. అయితే ఇవాళ నవంబర్‌ 8 నుంచి ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాకు బయలుదేరే ముందే విమానాశ్రయంలో వాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ చూపించాలి. అలాగే తాజాగా చేయించుకున్న కరోనా పరీక్ష నెగిటివ్‌ రిపోర్టును కూడా సమర్పించాల్సి ఉంటుంది.
అమెరికాకు దగ్గరలో ఉన్న సరిహద్దు ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో అమెరికాలో ప్రవేశించేవారు మాత్రం వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ చూపితే చాలు. వీరు కరోనా నెగిటివ్‌ రిపోర్టు చూపించాల్సిన పని లేదు. ఆంక్షల సడలింపుపై పూర్తి వివరాలు ఇవాళ మీడియా సమావేశంలో ప్రకటించే అవకాశముంది.