
ఆగ్రా: ఆగ్రా చేరుకున్న ట్రంప్ దంపతులకు యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం స్వాగతం చెప్పారు.వందలాది మంది కళాకారులు ఎయిర్పోర్టులో యూపీ సంప్రదాయ నృత్యం ‘మయూర్ డ్యాన్స్’తో వారికి వెల్కమ్ చెప్పారు. సిటీ వీధుల్లో ‘ఇండియా బెస్ట్ ఫ్రెండ్కు ఆగ్రా సిటీ వెల్కమ్ చెబుతోంది’ అంటూ భారీ బిల్బోర్డులను యూపీ సర్కారు ఏర్పాటు చేసింది.ఎయిర్పోర్ట్ నుంచి ఒబెరాయ్ అమర్విల్లా హోటల్ వరకు 13కిలోమీటర్ల మేర దాదాపు 3వేల మంది ఆర్టిస్టులు బ్రిజ్,అవధ్డ్యాన్స్ లు చేశారు.ట్రంప్ కాన్వాయ్కి 15వేల మంది స్కూలు చిన్నారులు అమెరికా,ఇండియా జెండాలతో ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి ఉన్నతాధికారుల ట్రంప్ కుటుంబాన్ని తాజ్ మహల్ సందర్శనకు తీసుకెళ్లారు. అక్కడ వారు సుమారు గంట పాటు గడిపారు. ఈ నేపథ్యంలో తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రంప్ టూర్ నేపథ్యంలో సోమవారం తాజ్మహల్ వద్ద అధికారులు మూడంచెల సెక్యూరిటీ వలయాన్ని ఏర్పాటు చేశారు.విజిటర్స్ ను ఉదయం 11.30 గంటల వరకే అనుమతించారు. మధ్యాహ్నం నుంచి ట్రంప్ కోసం గట్టి సెక్యూరిటీని ఏర్పాటుచేశారు. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఉంది. 2015లో అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ ఒబామా ఆగ్రా సందర్శించాలని అనుకున్నా..సెక్యూరిటీ కారణాల వల్ల టూర్ రద్దు చేసుకున్నారు. 2000లో యూఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సందర్శించారు.