లక్నో: లఖీంపూర్ ఘటనలో చనిపోయిన రైతు కుటుంబాలతో యూపీ ప్రభుత్వం జరిపిన చర్చలు జరిపింది. బాధిత కుటుంబాలకు రూ. 45 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాయపడిన వారికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపింది. నలుగురు అన్నదాతల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రైతుల ఫిర్యాదు ఆధారంగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని.. రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించేందుకు సర్కార్ ఒఫ్పుకుందని అడిషనల్ డీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు.
పార్టీలకు నో పర్మిషన్.. 144 సెక్షన్ అమలు
లఖీంపూర్ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు అడిషనల్ డీజీ తెలిపారు. ఇక్కడకు వచ్చేందుకు రాజకీయ పార్టీల నేతలకు అనుమతి లేదన్నారు. రైతు సంఘాల ప్రతినిధులకు మాత్రం అనుమతి ఉందన్నారు. రూల్స్ ఉల్లంఘించి ఎవరైనా వస్తే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
మంత్రి కొడుకుపై మర్డర్ కేసు
ఉత్తర్ ప్రదేశ్లోని లఖీంపూర్ ఘటనకు సంబంధించి కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై పోలీసులు మర్డర్ కేసు నమోదైంది. మంత్రి కొడుకుతోపాటు మరో 14 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల పైకి అజయ్ మిశ్రా కాన్వాయ్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. అయితే రైతుల మృతికి ఆశిష్ మిశ్రానే కారణమని.. ఆయన కారు దూసుకెళ్లడంతో అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు వస్తున్నాయి.
అసలు.. వాళ్లు రైతులే కాదు
లఖీంపూర్ ఘటనపై మంత్రి అజయ్ మిశ్రా స్పందించారు. ఈ అంశాన్ని విపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. బాధిత కుటుంబాల పక్షాన ఉంటానని హామీ ఇచ్చారు. రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాకేశ్ తికాయత్ వెంట ఉన్న వాళ్లు అసలు రైతులే కాదని.. తామే రైతులమన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో తాను లేనన్నారు.
వెంటనే విచారణ షురూ చేయాలె
లఖీంపూర్ ఘటనపై శిరోమణి అకాలీ దళ్ పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పందించారు. బాధ్యులను అరెస్ట్ చేసి.. వెంటనే విచారణను ప్రారంభించాలని సుఖ్బీర్ డిమాండ్ చేశారు. రైతుల మనోభావాలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరాహార దీక్షకు దిగిన ప్రియాంక
లఖీంపూర్ బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీతోపాటు పలువురు నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారిని సీతాపూర్లోని ఓ గెస్ట్హౌస్కు తరలించారు. పోలీసుల తీరుపై సీరియస్ అయిన ప్రియాంక.. తనకు చట్టం తెలుసునని, ఎందకు అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు. తనను ఈడ్చుకుంటూ వచ్చారని.. కిడ్నాప్ కేసులు పెడతానన్నారు. తనను నిర్బంధించిన గెస్ట్హౌస్లో ప్రియాంక నిరాహార దీక్షకు దిగారు. గెస్ట్హౌస్లోని ఓ గదిని ప్రియాంక చీపురుతో శుభ్రం చేస్తున్న వీడియోను ఒక జర్నలిస్టు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో వైరల్ అవుతోంది.
कांग्रेस ने जानकारी दी है कि प्रियंका गांधी अनशन पर बैठी हैं। यह विडियो सीतापुर के गेस्टहाउस का है जहां कांग्रेस नेताओं को गिरफ़्तारी के बाद रखा गया है। pic.twitter.com/bKtRrPvZYJ
— Aadesh Rawal (@AadeshRawal) October 4, 2021