
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఎన్ని దాడులు చేసినా.. ఎంత మందిని అరెస్టు చేసినా కొందరి ప్రవర్తన మారటం లేదు. లంచాలకు మరిగిన అధికారులు ఏదో ఒక విధంగా డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు. అసిస్టెంట్ల ద్వారా డీల్ సెట్ చేయించి.. ఎవరికీ తెలియటం లేదులే అన్నట్లుగా డబ్బులు తీసుకుంటున్నారు. శుక్రవారం (ఆగస్టు 22) హైదరాబాద్ వనస్థలీపురంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుపై ఏసీబీ జరిపిన దాడిలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఉద్యోగులు.
వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రూ.70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు సబ్ రిజిస్ట్రార్ రాజేష్, డాక్యుమెంట్ రైటర్ రమేష్. ఇబ్రహీంపట్నం తుర్కయంజాల్ లోని 200 గజాల ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ రాజేష్ ని కలిశాడు బాధితుడు.
►ALSO READ | కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళను రెండో పెళ్లి చేసుకున్న సీఐ...
దీంతో డబ్బులిస్తేనే పని అవుతుందని చెప్పారు సదరు అధికారి. రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.1లక్ష డిమాండ్ చేసినట్లు చెప్పాడు బాధితుడు. చివరికి రూ. 70 వేలకు బేరం కుదుర్చుకున్నారు ఆ సబ్ రిజిస్టర్. లంచం డబ్బును స్వయంగా తీసుకోకుండా రమేష్ అనే డాక్యుమెంట్ రైటర్ ద్వారా తీసుకున్నాడు సబ్ రిజిస్ట్రార్ రాజేష్.
ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం భారీగా లంచం డిమాండ్ చేస్తుండటంపై ఏసీబీ అధికారులను సంప్రదించాడు బాధితుడు. ఒప్పుకున్న మొత్తం చెల్లించాలని చెప్పిన అధికారులు.. చివరికి నిఘా ఉంచి డబ్బులు అందుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.