పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వరుణ్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి వరుణ్ గాంధీకి స్వాగతం చెబుతూ ప్రకటన చేశారు. గాంధీ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగానే పిలిభిత్ ఎంపీకి టికెట్ నిరాకరించారని చౌదరి ఆరోపించారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సంతోషిస్తామన్నారు. అతను మంచి విద్యావేత్త, పారదర్శకత ఉందన్నారు.
పిలిభిత్ నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ నిరాకరించింది. వరుణ్ గాంధీకి స్థానంలో రాష్ట్ర మంత్రి జితిన్ ప్రసాద్ కు టికెట్ ఇచ్చింది. వరుణ్ గాంధీ గత కొన్నాళ్లుగా పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఆయన్ను పక్కన పెట్టింది. వరుణ్ గాంధీ 2009లో తన తొలి పోటీలో పిలిభిత్ నుంచి 4.19 లక్షల ఓట్లతో గెలుపొందారు. 2014, 2019లో కూడి అక్కడి నుంచే ఎంపీగా గెలిచారు వరుణ్ గాంధీ. కానీ ఇప్పుడు ఆయన్ను కాదని బీజేపీ మరోకరికి టికెట్ కేటాయించింది.
ALSO READ | ఎలక్షన్ ప్రచారంలో లేనిది ఉన్నట్లు..ఉన్నది తప్పుగా
వరుణ్ గాంధీ రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. ఆయన కాంగ్రెస్లో లేదా సమాజ్వాదీ పార్టీలో చేరతారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి, అయితే ఇప్పటివరకు ఇవి ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. వరుణ్ గాంధీ ఈసారి బీజేపీ టిక్కెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయరని స్పష్టం చేయడంతో ఆయన భవిష్యత్తు అనిశ్చితంగా కనిపిస్తోంది. ఇక ఆయన తల్లి మేనకా గాంధీకి మరోసారి సుల్తాన్ పూర్ నుంచి టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది బీజేపీ.