![సంక్రాంతి విందు భోజనం](https://static.v6velugu.com/uploads/2023/01/veera-simha-reddy-succes-meet_iQpCosHjhM.jpg)
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈనెల 12న విడుదలైన సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు సక్సెస్మీట్ నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘గ్రాండ్ సక్సెస్ను ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ‘అఖండ’ బ్లాక్ బస్టర్ తర్వాత నెలకొన్న అంచనాలకు ధీటుగా, ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఓ మంచి సినిమా చేద్దామని ‘వీరసింహారెడ్డి’ కథను ఎంచుకున్నాం. అందరి సమిష్టి కృషితో నా అభిమాని అయిన గోపీచంద్ అద్భుతంగా తీశాడు. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరున అభినందనలు.
సంక్రాంతికి విందుభోజనం లాంటి సినిమా ఇది. ముఖ్యంగా బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ చూస్తూ మగవాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అన్ని ఏరియాల నుండి అద్భుతమైన ఆదరణ వస్తోంది ’ అన్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘బాలకృష్ణ గారు ఇచ్చిన అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసుకున్నా. ఆయన్ను అద్భుతంగా చూపించానని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. నా కెరీర్ లో ఇన్ని పొగడ్తలు ఎప్పుడూ రాలేదు . ఈ సినిమాని ఓ బాధ్యతగా తీసుకుని చేశా. బాలకృష్ణ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా నాది కావడం ఆనందంగా వుంది.
ఇందులోని ఎమోషన్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. సెకెండ్ హాఫ్లో ఏడవకుండా బయటికి వచ్చే వాళ్ళు లేరు. మాస్ హీరో సినిమాలో ఇలా కన్నీళ్లు పెట్టించడం మామూలు విషయం కాదు. రికార్డ్ కలెక్షన్స్ తో సినిమా మొదలైంది. నా కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్’ అన్నాడు. ‘మేము ఊహించిన దాని కంటే పెద్ద బ్లాక్ బస్టర్ ని సాధించింది. అన్ని చోట్ల రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది’ అన్నారు నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్. వరలక్ష్మీ శరత్ కుమార్, తమన్ తదితరులు పాల్గొన్నారు.