బండ్ల సేల్స్ భేష్..GST తగ్గింపుతో భారీగా పెరిగిన టూవీలర్ అమ్మకాలు

బండ్ల సేల్స్ భేష్..GST తగ్గింపుతో భారీగా పెరిగిన టూవీలర్ అమ్మకాలు

న్యూఢిల్లీ: జీఎస్టీ రేట్ల తగ్గింపు, పండుగల డిమాండ్​ కారణంగా సెప్టెంబర్​లో వెహికల్స్​డిస్పాచ్​లు (కంపెనీల నుంచి డీలర్లకు వచ్చినవి) పెరిగాయని ఆటోమొబైల్​పరిశ్రమ సంఘం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) బుధవారం తెలిపింది. గత సెప్టెంబర్​లో 3,56,752 యూనిట్లుగా ఉన్న ప్యాసింజర్​వెహికల్స్​ (పీవీ) డిస్పాచ్​లు గత నెలలో 4 శాతం పెరిగి 3,72,458 యూనిట్లకు చేరాయి. 

టూవీలర్​సేల్స్  ఏడు శాతం పెరిగి 21,60,889 యూనిట్లకు ఎగిశాయి. గత సెప్టెంబర్​లోలో 20,25,993 యూనిట్లు అమ్ముడయ్యాయి. త్రీవీలర్​ డిస్పాచ్​లు 5.5 శాతం వృద్ధితో 79,683 యూనిట్ల నుంచి 84,077 యూనిట్లకు పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్​ 22 నుంచి కొత్త జీఎస్​టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. కేవలం 9 రోజుల్లోనే ప్యాసింజర్​ వెహికల్స్, టూ, త్రీవీలర్​అమ్మకాలు రికార్డుస్థాయిలో పెరిగాయని సియామ్​ ప్రెసిడెంట్​ శైలేష్​ చంద్ర తెలిపారు.  జీఎస్​టీ 2.0 భారత ఆటో పరిశ్రమను తదుపరి స్థాయికి తీసుకెళ్లడమే కాక, మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తోందని అన్నారు.--

రెండో క్వార్టర్​లో అమ్మకాలు ఇలా..

ఈ ఏడాది జులై–-సెప్టెంబర్​ క్వార్టర్​లో ప్యాసింజర్​ వెహికల్స్​ అమ్మకాలు 1.5 శాతం తగ్గి 10,39,200 యూనిట్లకు పడిపోయాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో 10,55,137 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ క్వార్టర్​లో మొదటి రెండు నెలల్లో తగ్గుదల కనిపించినా, జీఎస్​టీ తగ్గింపు,  వినియోగదారుల బలమైన సెంటిమెంట్​, పండుగ సీజన్​ ప్రారంభం కారణంగా సెప్టెంబర్​లో సేల్స్​ పెరిగాయని చంద్ర తెలిపారు. 

ప్యాసింజర్​ వెహికల్స్​సెగ్మెంట్లో యుటిలిటీ వెహికల్స్​ వాటా దాదాపు మూడింట రెండు వంతులు ఉంది.  పీవీల్లో ఎస్​యూవీ సెగ్మెంట్​ వాటా 29 శాతం నుంచి 56 శాతానికి పెరిగిందని చంద్ర పేర్కొన్నారు. ప్యాసింజర్​ కార్ల అమ్మకాలు మాత్రం ఈ క్వార్టర్​లో పెద్దగా మారలేదు. జీఎస్​టీ రేటు తగ్గింపుతో ధరలు తగ్గడం ద్వారా చిన్న కార్ల సెగ్మెంట్​లో అమ్మకాలు పెరిగాయని ఆయన తెలిపారు.

 టూవీలర్​ అమ్మకాలు 7 శాతం జంప్​

టూవీలర్ల​ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 7 శాతం వృద్ధితో 55,62,077 యూనిట్లుగా నమోదయ్యాయి.    ఆర్థిక కార్యకలాపాలు,  కొనుగోలు శక్తి, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం​,  జీఎస్​టీ రేటు తగ్గింపు దీనికి దోహదపడ్డాయని సియామ్​ తెలిపింది. స్కూటర్ల సెగ్మెంట్ 12 శాతం, మోటార్​సైకిళ్ల సెగ్మెంట్​ 5 శాతం వృద్ధిని సాధించాయి. 

త్రీవీలర్​ డిస్పాచ్​లు ఏడాది ప్రాతిపదికన 10 శాతం వృద్ధితో 2,29,239 యూనిట్లకు పెరిగాయి. పట్టణ, సెమీ–-అర్బన్​ ప్రాంతాల్లో డిమాండ్​, సులభమైన ఫైనాన్సింగ్, రీప్లేస్​మెంట్​ అమ్మకాలు ఈ వృద్ధికి కారణం. కమర్షియల్​ వెహికల్స్ అమ్మకాలు జులై క్వార్టర్​లో 8 శాతం వృద్ధితో 2.4 లక్షల యూనిట్లకు పెరిగాయి.  ఇక నుంచి కూడా ఆటో అమ్మకాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సియామ్​ తెలిపింది.