కాళోజీ.. ఓ ధిక్కార స్వరం

కాళోజీ.. ఓ ధిక్కార స్వరం

కలాన్ని ఆయుధంగా చేసుకొని తల్లి భాషలోనే కవిత్వం రాసి, ప్రజల పక్షం వహించి, తన కవిత్వంతో సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన నిత్య చైతన్య శీలి ప్రజా కవి కాళోజీ. తెలంగాణ భాషకు ఊపిరి పోసిన బహు భాషావేత్త ఆయన. ఉద్యమకారుడు, రచయిత, అన్యాయాలపై ఉక్కుపిడికిలెత్తిన ఆయన 1914 సెప్టెంబర్​9న కాళోజీ రంగారావు రమాబాయి దంపతులకు ద్వితీయ సంతానంగా బీజాపూర్ జిల్లా రట్టిహల్లిలో పెట్టారు. కాళోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్ రాజా కాళోజీ. ఆయన కుటుంబం మడికొండలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నది. ప్రాథమిక విద్య మడికొండలో, ఉన్నత విద్య హనుమకొండలో పూర్తి చేసిన కాళోజీ.. చదువుకునే రోజుల నుంచే పోరాట స్ఫూర్తిని నింపుకున్నారు. 

భగత్ సింగ్ ను ఉరి తీయడం, స్కూల్లో నాటకాలు కాళోజీ వ్యక్తిత్వాన్ని దృఢంగా మార్చాయి. ఖలీల్ జీబ్రాన్ రచనలతో ప్రభావితులయ్యారు. ‘అన్యాయ అసమానతలను చూసి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు’ అంటూ ‘పరుల కష్టం చూసి పగిలిపోవును గుండె- మాయ మోసము చూసి మండిపోవును ఒళ్లు’ అంటూ అక్షరాలని ఆయుధాలుగా చేసుకుని ఈ వ్యవస్థపై వ్యంగ్యంతో, బాధతో, కోపంతో నిజమైన మనిషిగా స్పందిస్తాడు. ‘ఓటిచ్చినప్పుడే ఉండాలి బుద్ధి’ అంటూ ఓటరుకు కర్తవ్య బోధ చేస్తాడు. ‘బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలి’ అన్నాడు. 

వాడుక భాషలో రచనలు రావాలని కోరుకున్నాడు. పరభాష వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్న వారిని చూసి, ‘తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచబడియెదవు సంగతేమిటి రా.. అన్య భాషలు నేర్చు ఆంధ్రంబు రాదనుచు సఖిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అంటూ ఘాటుగా చురకలంటిస్తాడు. ‘నీ భాషలో నీ బతుకున్నది, నీ యాసలనే నీ సంస్కృతున్నది.. ఎవని యాసల వాడు రాయాల’ని గట్టిగా గర్జించి చెప్పిండు. తెలంగాణ భాషకు ప్రాణం పోసిన కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భాషలోనే మనిషి జీవమున్నదని నమ్మిన గొప్ప వ్యక్తి ఆయన.

ఎన్నో బాధ్యతలు చేపట్టి..

తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొనని సమావేశాలు, నిరసనలు లేవు. ‘అన్నపురాసులొకచోట ఆకలి కేకలు ఒకచోట’ అంటూ సమాజంలో అసమానతలు నిరసించిండు. ‘బతుకు తప్పదు... బతక్కా తప్పదు.. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు’ అంటూ.. తన లెక్కనే అన్యాయాన్ని ఎదిరించాలనే స్పృహను ప్రజల్లో కలిగించిండు. అన్యాయం అసమానలతో గొడవ పెట్టుకుని ‘నా గొడవ’కు శ్రీకారం చుట్టారు. ‘ఉదయం కానే కాదనుకోవడం నిరాశ.. ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ’ అంటూ ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ బతుకు మీద భరోసా నేర్పిండు. ‘సాగిపోవుటే బతుకు ఆగిపోవుటే సావు’ అని నిత్య చైతన్యంతో ముందుకు సాగాలని చెప్పాడు. ‘అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్నాడు. 

తన రచనలతో తెలంగాణ యావత్తు ప్రజల మెదళ్లను కదిలించిన కలం యోధుడు ఆయన. 1958 నుంచి1960 వరకు రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా, ఆంధ్రసారస్వత పరిషత్ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా ఆయన సేవలు అనన్య సామాన్యం. అణా కథలు, కాళోజీ కథలు, పార్థివ వ్యయం, నాగొడవ, తెలంగాణ ఉద్యమ కవితలు, ఇది నా గొడవ తదితర రచనలు గుర్తింపు పొందాయి. బాపు! బాపు!! అని పేరు పెట్టి ఆత్మకథను రాసుకున్నారు. కాళోజీ అన్నయ్య సుప్రసిద్ధ న్యాయవాది, ఉర్దూ కవి ‘షాద్’ గా ప్రసిద్ధుడైన రామేశ్వరరావు. కాళోజీ భార్య పేరు రుక్మిణి, కుమారుడు రవి కుమార్.

కాళోజీ ఆశయం నెరవేరలేదు..


భాష విషయంలో ఇప్పటికీ కాళోజీ ఆశయం నెరవేరలేదనే చెప్పాలి. నిత్య వ్యవహారంలో మనం మాట్లాడే సులభతరమైన భాష.. మన తెలుగులో ఇంకా పూర్తిగా రాలేదు. మాతృభాషలో చదివితే దాని భావం మనసుకు చేరుతుంది. మాతృభాషలో మాట్లాడితే అవమానంగా భావించే వారు సరిగా రాకపోయినా పరాయి భాషలో మాట్లాడితే గౌరవ సూచకమని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్లు  మాటల వరకే మాతృభాషపైన అభిమానాన్ని చూపుతున్నది. ఇటీవల ఇంటర్​లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టి, తెలుగు భాషను చిన్నబుచ్చారు. ప్రజలకు అనుగుణంగా రచనలు చేసి తెలంగాణ భాషకు, యాసకు ప్రాణం పోసిన కాళోజీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు మణి మకుటమైన భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలె.  

కాళోజీ పిలుపునే స్పూర్తి గా తీసుకుని నేను108 పాటలతో  పూల జాతర బతుకమ్మ పాటల పుస్తకాన్ని వెలువరించాను. కాళోజీ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాషను రక్షించి భవిష్యత్ తరాలకు బహుమానంగా అందించాలి. హన్మకొండ నగరంలో కాళోజీ కళాక్షేత్రం ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. వీధుల్లో విగ్రహాలు పెట్టి, విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టి తనను యాదికి జేసుకొని  ఘనంగా నివాళులర్పిస్తున్నాం. తెలంగాణలో మాండలిక భాషకు సరైన గౌరవం కల్పించిన రోజే కాళోజీకి మనమిచ్చే నిజమైన నివాళి.

- కొమ్మాల సంధ్య, తెలుగు లెక్చరర్