
దీపావళి పండగను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ. ఇవాళ(ఆదివారం) ఉదయం జాతిని ఉద్దేశించి, ఆల్ ఇండియా రేడియో మాధ్యమంగా ‘మన్ కీ బాత్’ను మోడీ వినిపించారు. దీపావళి పండగ, భారత సంస్కృతిలో భాగమని అన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, తక్కువ కాలుష్యాలు వెదజల్లే టపాకాయలను ఎంచుకోవాలని సూచించారు.
నవంబర్ 12న గురు నానక్ దేవ్ 550వ ప్రకాశ్ ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మోడీ. ఇటీవల 85 దేశాల ప్రతినిధులు ఢిల్లీ నుంచి అమృతసర్ కు ప్రయాణించి, గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారని, వారంతా భారత సంస్కృతి, సంప్రదాయాలను ఎంతో కొనియాడారన్నారు.
ఇదే సమయంలో అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అని ప్రజలు మరువరాదని, ఉక్కు మనిషిగా జాతిని ఏకం చేసిన ఘనత ఆయనదేనని వ్యాఖ్యానించారు. అందుకే ప్రతి యేటా అక్టోబర్ 31వ తేదీని జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటున్నామని అన్నారు.
అయోధ్య, రామజన్మభూమి వివాదాన్ని ప్రస్తావించిన మోడీ, 2010, సెప్టెంబర్ లో ఈ కేసు విషయమై అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేశారు. ఆపై సుప్రీంకోర్టులో 9 సంవత్సరాల పాటు వాదనలు జరిగాయని, త్వరలోనే తీర్పు వెలువడుతుందని అన్నారు. దేశంలోని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా సుప్రీం తీర్పు ఉంటుందని భావిస్తున్నానని అన్నారు.