
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు భారత్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా అమెరికా ప్రథమ మహిళా మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన హ్యాపీనెస్ క్లాసుకు హాజరయ్యారు. చిన్నారులతో ఉత్సాహంగా గడిపారు. ఢిల్లీలోని దక్షిణ మోతీబాగ్ లో ఉన్న సర్వోదయ కో ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ స్కూల్ ను సందర్శించిన మెలానియా అక్కడి బోధనా విధానాన్ని పరిశీలించారు.
ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న హ్యాపీనెస్ క్లాసులతో చిన్నారులే కాకుండా తాను కూడా స్ఫూర్తి పొందానని తెలిపారు మెలానియా ట్రంప్. ఇంతటి సంతోషకరమైన కార్యక్రమాలతో విద్యార్థులు తమ రోజును ప్రారంభించడం హర్షణీయమని తెలిపారు. భారత్ రావడం ఇదే తొలిసారి అని, తన పర్యటన ఎంత అద్భుతంగా ఉందో ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు మెలానియా. ఈ పర్యటనపై ట్రంప్, తాను ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పారు. తనను సంప్రదాయ విధానంలో స్వాగతించడాన్ని మరువలేనని తెలిపారు మెలానియా.