![విశాక ఇండస్ట్రీస్ ఆదాయం రూ. 358 కోట్లు](https://static.v6velugu.com/uploads/2023/02/Visaka-Industries-Ltd_1YdK2GIFJA.jpg)
హైదరాబాద్, వెలుగు: విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్కు డిసెంబర్ 31, 2022తో ముగిసిన మూడో క్వార్టర్లో రూ. 358.95 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే సెప్టెంబర్ 30, 2022తో ముగిసిన రెండో క్వార్టర్లో 366.95 కోట్ల ఆదాయం సాధించింది. క్యూ3 లో కంపెనీకి రూ. 3.35 కోట్ల లాభం వచ్చింది. సెప్టెంబర్ క్వార్టర్లో 7.375 కోట్ల నికరలాభం వచ్చింది. కంపెనీ ఈపీఎస్ తాజా క్వార్టర్లో రూ. 1.94 ఉంది. సెప్టెంబరు క్వార్టర్లో రూ.4.27 ఉంది. సంవత్సరం లెక్కన మొత్తం ఆదాయం రూ.357.14 కోట్ల నుంచి రూ.358.95 కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.23.98 కోట్ల నుంచి రూ.3.35 కోట్లకు పడిపోయింది. ఇదే కాలంలో ఈపీఎస్ రూ.14.14 నుంచి రూ.1.94లకు పడిపోయింది. డిసెంబర్ 31, 2021తో ముగిసిన 9 నెలల కాలంలో కంపెనీకి రూ.1002.86 కోట్ల ఆదాయం రాగా, డిసెంబర్ 31, 2022తో ముగిసిన 9 నెలల కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.1208.29 కోట్లుగా రికార్డయింది. ఇదే కాలంలో నికర లాభం రూ.88.48 కోట్ల నుంచి రూ.49.25 కోట్లకు తగ్గింది. ఈపీఎస్ రూ.52.09 నుంచి రూ.28.50కి తగ్గింది.
1981లో డాక్టర్ గడ్డం వివేకానంద్ స్థాపించిన విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిమెంట్ షీట్లు, ఫైబర్ సిమెంట్ బోర్డుల నుంచి మొదలుకొని హైబ్రిడ్ సోలార్ రూఫ్లు, ఫైబర్ నూలు వరకు చాలా ప్రొడక్టులను తయారు చేస్తోంది. వివేకానంద్ నాయకత్వంలో పర్యావరణ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో, మార్కెట్ డిమాండ్లను తీర్చడంలో విశాక ముందంజలో ఉంది. కంపెనీ ‘ది వండర్ యార్న్’ను కూడా తయారు చేస్తోంది. దీనిని వస్త్రాలు, దుస్తులు, ఫర్నిషింగ్లు, ఆటోమోటివ్ ఫ్యాబ్రిక్స్ వంటి వాటిలో వాడుతారు. సోలార్ పవర్తో నడిచే హైబ్రిడ్ రూఫ్-టాప్ను కూడా ఉత్పత్తి చేస్తోంది. విశాక ఇండస్ట్రీస్కు దేశంలో 12 తయారీ యూనిట్లు, 13 మార్కెటింగ్ కార్యాలయాలు, 7000 కు పైగా డీలర్ అవుట్లెట్స్ ఉన్నాయి.