హైదరాబాద్, వెలుగు: తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాక ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. విశాక ఇండస్ట్రీస్ ఆర్థిక లావాదేవీలను కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరికతో ముడిపెడుతూ నమస్తే తెలంగాణ, టీన్యూస్ తప్పుడు వార్తా కథనాలు రాయడం, ప్రసారం చేయడంపై గురువారం ప్రెస్ నోట్ విడుదల చేసింది. తమ సంస్థ కార్పొరేట్ ఆఫీస్ కోసం హైటెక్ సిటీ ఏరియాలో భూమి కొనుగోలు చేస్తున్నదని, ఈ ఏడాది ఆగస్టులో ల్యాండ్ సెల్లర్తో అగ్రిమెంట్ చేసుకుని బయానా చెల్లించినట్లు విశాక ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఈ లావాదేవీలను 2022–23 బ్యాలెన్స్ షీట్లో పొందుపరుస్తామని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన ట్రాన్సాక్షన్ను, పోయినేడాది బ్యాలెన్స్ షీట్లో చూపించలేదని వార్తలు రాయటం.. పూర్తిగా రాజకీయ కక్షతోనే చేసినట్టుగా తెలుస్తున్నదని పేర్కొంది.
విశాక ఇండస్ట్రీస్ చైర్మన్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామిని బద్నాం చేసేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. గత ఆర్థిక సంవత్సరంలో జమునా హేచరీస్కు విశాక ఇండస్ట్రీస్ కొంత డబ్బును అప్పుగా ఇచ్చిందని, ఇటీవలే ఆ అప్పును వడ్డీతోపాటు జమునా హేచరీస్ తిరిగి చెల్లించిందని వివరించింది. సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ సంస్థకు గత ఆర్థిక సంవత్సరంలో విశాక ఇండస్ట్రీస్ రూ. 25 కోట్లు అప్పుగా ఇచ్చిందని, ఈ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన అన్ని వివరాలు కంపెనీ బ్యాలెన్స్ షీట్లలో నమోదవుతాయని పేర్కొంది. కంపెనీ లావాదేవీలను రాజకీయ కక్షతో వక్రీకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాక ఇండస్ట్రీస్ హెచ్చరించింది.