- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
మందమర్రి, వెలుగు: రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామన్న సీఎం కేసీఆర్ గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని, వెంటనే రెగ్యులర్చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం నుంచి సింగరేణిలో చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. సింగరేణి వ్యాప్తంగా 40 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నారని, వారి డిమాండ్లను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా రాష్ట్ర సర్కార్ పరిగణించాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు వీరంతా సకలజనుల సమ్మెలో పాల్గొన్నట్లు చెప్పారు. సమ్మెలో పాల్గొన్న సింగరేణి పర్మినెంటు కార్మికులకు ప్రత్యేకంగా సకలజనుల సమ్మె వేతనాలు ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికులను విస్మరించారన్నారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని కేసీఆర్ నమ్మించి మోసం చేశాడన్నారు. కార్మికుల సమస్యను కేంద్ర బొగ్గు గనుల శాఖ, కార్మికశాఖ మంత్రుల దృష్టికి తీసుకవెళ్లనునట్లు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి సింగరేణి యాజమాన్యం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు పలు కార్మిక సంఘాల నాయకులు ముల్మూరి శ్రీనివాస్, రామగిరి నాగరాజు, ఆకుల వెంకన్న, అరవింద్, వై.వి రావు, బుర్ర తిరుపతి, సతీశ్మద్దతు తెలిపారు.