ఉక్రెయిన్ విషయంలో రష్యా తన లక్ష్యాన్ని సాధించి తీరుతుందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించారు. ఈ విషయంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సహించమని హెచ్చరించారు. ఉక్రెయిన్తో చర్చలకు రష్యా సిద్ధంగా ఉందన్న పుతిన్.. సైనిక చర్య మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రష్యాను నాశనం చేసేందుకు కొందరు దేశ ద్రోహులను పశ్చిమ దేశాలు పావులుగా వాడుకుంటున్నాయని పుతిన్ ఆరోపించారు. రష్యాను వ్యతిరేకించే వారిని దేశ ద్రోహులుగా అభివర్ణించిన ఆయన.. అలాంటి వారిని రష్యన్లు తేలికగా గుర్తిస్తారని అన్నారు. రష్యాను విభజించేందుకు పౌరుల మధ్య ఘర్షణలు తలెత్తేలా కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. రష్యాను నాశనం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొడతామని స్పష్టం చేశారు.