ఓటేస్తే దోసె, మైసూర్ పాక్, జ్యూస్ ఫ్రీ.. టెంప్టింగ్ ఆఫర్స్ ప్రకటించిన హోటల్స్

ఓటేస్తే దోసె, మైసూర్ పాక్, జ్యూస్ ఫ్రీ.. టెంప్టింగ్ ఆఫర్స్ ప్రకటించిన హోటల్స్

కర్ణాటక ఎన్నికలకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కేవలం 48 గంటల కంటే తక్కువ సమయం ఉన్నందున, బెంగళూరులోని ఒక హోటల్ ఓటర్లను, ముఖ్యంగా మొదటిసారి ఓటేసే వారిని ప్రోత్సహించడానికి ఒక టెంప్టింగ్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. నగరంలోని నిసర్గ హోటల్‌ ఈ క్రేజీ ఆఫర్ తో ఓటర్లను ఆకర్షిస్తోంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటేసి, చేతి వేలికి రాసిన సిరా చూపిన వారికి ఈ స్పెషల్ ఆఫర్ వర్తించనున్నట్టు హోటల్ యాజమాన్యం వెల్లడించింది.

సిరా వేసిన వేలిని చూపించే ఓటర్లకు ఉచితంగా బెన్నె దోసె, మైసూర్ పాక్, గ్లాసు జ్యూస్ అందజేస్తామని హోటల్ ప్రకటించింది. అదనపు ప్రోత్సాహకంగా.. మొదటి సారి ఓటేసే వారికి ఈ హోటల్ ఒక కన్నడ సినిమా టిక్కెట్‌ను కూడా ఉచితంగా అందజేస్తోంది.

ఓటర్లను ప్రోత్సహించేందుకు ఈ హోటల్ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఇదేం మొదటిసారి కాదు. ఈ హోటల్ గతంలోనూ ఇదే తరహా ఆఫర్లతో ఓటర్లను ప్రోత్సహిస్తూ వస్తోంది. అలా ఈ హోటల్ ఈ ఏడాదితో మూడు సార్లు ఆఫర్లు ప్రకటించిన హోటల్ గా పేరు తెచ్చుకోనుంది. ఇంతకుమునుపు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆ తర్నాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ  ఉచితంగా పలు సేవలను అందిస్తూ ఈ హోటల్ వార్తల్లో నిలిచింది.