
- యూఎస్ డైరెక్ట్గా జోక్యం చేసుకోకపోవచ్చని అంచనా
- పడిన క్రూడాయిల్ ధరలు
- మెరిసిన్ ఫైనాన్షియల్, టెలికం, టెక్ షేర్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం ఒక శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఫైనాన్షియల్, టెలికం, టెక్ స్టాక్స్లో కొనుగోళ్లు పెరగడంతో కీలక లెవెల్స్ పైన క్లోజయ్యాయి. గ్లోబల్ క్రూడ్ ధరలు దిగిరావడం కలిసొచ్చింది. మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ తగ్గిన సంకేతాలు, విదేశీ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ కూడా డొమెస్టిక్ ఈక్విటీలకు సపోర్ట్ చేశాయని ట్రేడర్లు చెప్పారు.
]సెన్సెక్స్ శుక్రవారం ఫ్లాట్గా మొదలైంది. ఆ తర్వాత ఒక శాతానికి పైగా జంప్ చేసింది. ఈ ఇండెక్స్ 1,046.30 పాయింట్లు (1.29శాతం) లాభపడి 82,408.17 వద్ద సెటిల్ అయింది. ఇంట్రాడేలో 1,132.62 పాయింట్లు (1.39శాతం) పెరిగి 82,494.49 వరకు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 319.15 పాయింట్లు (1.29శాతం) పెరిగి 25,112.40 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 2,463 స్టాక్స్ లాభాల్లో ముగియగా, 1,484 నష్టపోయాయి. 147 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. ఈ వారంలో సెన్సెక్స్ 1,289.57 పాయింట్లు (1.58శాతం), నిఫ్టీ 393.8 పాయింట్లు (1.59శాతం) జంప్ చేశాయి.
సెన్సెక్స్ కంపెనీల్లో భారతీ ఎయిర్టెల్, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎక్కువగా పెరిగాయి. మారుతి మాత్రమే నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.20శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.55శాతం లాభపడ్డాయి. అన్ని బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్లు పెరిగాయి. టెలికమ్యూనికేషన్ 2.73శాతం, రియల్టీ 2.22శాతం, టెక్ 1.42శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.17శాతం, బ్యాంకెక్స్ 1.15శాతం, కన్జూమర్ డిస్క్రిషనరీ 1.12శాతం, మెటల్ 1.10శాతం లాభపడ్డాయి.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
“మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తగ్గడం, యూఎస్– -ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికిప్పుడు సైనిక చర్యల రిస్క్ లేదని తెలుస్తోంది. దీనికి తోడు క్రూడ్ ధరలు తగ్గాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఇండియన్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బ్రాడర్ మార్కెట్లో విక్స్ ఇండెక్స్ తగ్గడం, ఫైనాన్స్, ఆటో, రియల్టీ లాంటి రేట్ సెన్సిటివ్, కన్జూమర్ -ఆధారిత సెక్టార్లలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్ శుక్రవారం ర్యాలీ చేసింది’’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. జూన్ క్వార్టర్ ఫలితాలు ప్రారంభం కానున్నాయని, ఆర్బీఐ రేట్ల కోత, ద్రవ్యోల్బణం దిగిరావడం, వినియోగం ఊపందుకోవడం వంటి అంశాలతో మార్కెట్ పెరిగిందని వివరించారు.
“ఇరాన్, -ఇజ్రాయెల్ మధ్య టెన్షన్స్ తగ్గే అవకాశం ఉంది. ఈ గొడవలో జోక్యం చేసుకోవడంపై యూఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో మార్కెట్ సెంటిమెంట్ బెటర్ అయింది. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, ఎఫ్ఐఐ కొనుగోళ్లు చేయడం కూడా మార్కెట్కు సపోర్ట్ చేసింది” అని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా చెప్పారు. “పెద్ద డొమెస్టిక్ ఈవెంట్స్ లేకపోవడంతో గ్లోబల్ మార్కెట్లు మన మార్కెట్ల డైరెక్షన్ను నిర్ణయిస్తున్నాయి. ‘పాజిటివ్ కానీ జాగ్రత్త’.. స్ట్రాటజీని కొనసాగిస్తాం. సెక్టోరల్ ట్రెండ్స్కు అనుగుణంగా స్టాక్ సెలెక్షన్పై ఫోకస్ చేయాలని సలహా ఇస్తున్నాం” అని ఆయన చెప్పారు.
మిశ్రమంగా గ్లోబల్ మార్కెట్లు..
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పీ, హాంగ్కాంగ్ హాంగ్ సెంగ్ పాజిటివ్లో ముగిశాయి. జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో కదిలాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ శుక్రవారం 1.93శాతం తగ్గి బ్యారెల్కి 77.33 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.