లండన్‌లో వరంగల్ జిల్లా విద్యార్థి మృతి

లండన్‌లో వరంగల్ జిల్లా విద్యార్థి మృతి

ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన వరంగల్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఐనవోలు మండలం రాంనగర్‌కు చెందిన 26 ఏళ్ల కాయిత సతీశ్ గతేడాది జనవరిలో పై చదువుల కోసం లండన్ వెళ్లాడు. భారత కాలమానం ప్రకారం నిన్న(ఆదివారం) తెల్లవారుజాము నిద్రలో ఉండగానే గుండెపోటుకు లోనయ్యాడు. పడుకున్న మంచం పై నుంచి కిందపడిపోవడంతో గమనించిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సతీశ్‌ను రాయల్ ప్రిస్టిన్ ఆస్పత్రికి తరలించారు. అయితే… అప్పటికే అతడు మృతి చెందినట్టు డాక్టర్లు కన్ఫాం చేశారు.

సతీశ్ మృతి విషయాన్ని అతడి స్నేహితులు రాంనగర్‌లో ఉంటున్న అతడి తల్లిదండ్రులు కుమారస్వామి, శారదకు వీడియో కాల్ ద్వారా తెలిపారు. ఈ మధ్య కాలంలోనే కుమారుడితో మాట్లాడామని, కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచించామని, అంతలోనే ఇలా జరిగిందంటూ కన్నీరుమున్నీరయ్యారు.

సతీశ్ అన్న రంజిత్ అమెరికాలో ఉండగా, తమ్ముడు దేవేందర్ లండన్‌లోనే మరో ప్రాంతంలో ఎంఎస్ చదువుతున్నాడు. సతీశ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాల్సిందిగా మృతుడి తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు.