రూ. 1200 కోట్లతో సభ పెడ్తున్నవ్..ఆ పైసలన్నీ ఎక్కడివి?..కేసీఆర్ ను ప్రశ్నించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి

రూ. 1200 కోట్లతో సభ పెడ్తున్నవ్..ఆ పైసలన్నీ ఎక్కడివి?..కేసీఆర్ ను ప్రశ్నించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి
  • మనిషికి రూ.400 ఇచ్చి సభకు తీసుకొస్తున్నరని ఆరోపణ

పరకాల, వెలుగు :  “ రూ.1200 కోట్లు ఖర్చు పెట్టి వరంగల్​ఎల్కతుర్తిలో సభ పెడుతున్నవ్​..? ఆ పైసలన్నీ ఎక్కడివి..? పదేండ్లలో ప్రజలను దోచుకున్నవి కాదా?.. నీ తాత సంపాదించిన భూమి అమ్మి పెట్టిన పైసలా? అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్​రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం ఫెయిల్ ​అయిందని విమర్శలు చేసే ముందు బీఆర్ఎస్​లోని 36 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మళ్లీ గెలిస్తే తను రాజీనామా చేసి రాజకీయాల్లోకి రాకుండా సన్యాసం తీసుకుంటానని ఆయన సవాల్​చేశారు. 

శనివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ప్రెస్​మీట్ లో మాట్లాడారు. అధికారం కోల్పోయిన17 నెలల్లోనే10 లక్షల మందిని సభకు తెస్తామంటూ.. మనిషికి రూ.400 ఇస్తున్నారని ఆరోపించారు.  కేసీఆర్ ఫాంహౌజ్​లో ఉంటూ ఇప్పుడు జనాల్లోకి రావడానికి సిగ్గుండాలని ఆయన ఫైర్ అయ్యారు. కేసీఆర్ ది అబద్ధాలతో కూడిన చరిత్ర అని,  పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టిన రోజు కూడా పోలేదని గుర్తు చేశారు. సోనియమ్మ కాళ్లు మొక్కి టీఆర్​ఎస్​ను కాంగ్రెస్​లో విలీనం చేస్తనని మాట మార్చి అధికారంలోకి వచ్చి మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్ తన స్వార్థంతో అప్పుల పాలు చేసింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు.  టౌన్​ప్రెసిడెంట్ ​కొయ్యడ శ్రీనివాస్​, కుంకుమేశ్వర ఆలయ చైర్మన్​ రాజేశ్వర్​రావు, ఏఎంసీ చైర్మన్​ రాజిరెడ్డి ఉన్నారు.