
- అన్నవరం నుంచి హైదరాబాద్ తరలించేందుకు ప్లాన్
వరంగల్/కరీమాబాద్, వెలుగు : ఏపీ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న రూ. కోటి విలువైన ఎండు గంజాయిని వరంగల్ నార్కోటిక్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ సైదులు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా వలసంపేట గ్రామానికి చెందిన విరోదుల శ్రీను అనే వ్యక్తి మరో ఆరుగురితో కలిసి గంజాయి తరలించేందుకు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ఏపీలోని అన్నవరం నుంచి ట్రాక్టర్లో గంజాయిని తీసుకొని వస్తున్నాడు. ఖమ్మం వద్దకు రాగానే అతనిని మహబూబాబాద్ జిల్లా ధర్మారంతండాకు చెందిన గుగులోతు భాస్కర్, కంబాలపెల్లికి చెందిన కొర్ర వినోద్కుమార్, నల్గొండ జిల్లా పెద్దమునిగేడు గ్రామానికి చెందిన కేతావత్ రామునాయక్ కలిశారు.
వీరు కారులో పైలెట్గా ముందుకు వస్తున్నారు. సమాచారం అందుకున్న వరంగల్ నార్కోటిక్ పోలీసులు వరంగల్ ఉర్సు గుట్ట సమీపంలో ట్రాక్టర్ను పట్టుకున్నారు. రూ. 1.05 కోట్ల విలువైన 210.760 కిలోల ఎండు గంజాయిని, ట్రాక్టర్, కారును స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి బాబు, గోవిందమ్మ, శ్రీకాంత్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నారని డీఎస్పీ సైదులు తెలిపారు. నిందితులను పట్టుకున్న ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్సైలు శ్రీకాంత్, రాజు, మొగిలితో పాటు హెడ్కానిస్టేబుల్ రంగయ్య, నిరంజన్, సోమలింగం, శ్రీనివాస్ను అభినందించారు. ఇదిలా ఉండగా.. నిందితులను వరంగల్ ములుగు రోడ్డులోని నార్కోటిక్ పోలీస్ స్టేషన్కు తీసుకొస్తుండగా ట్రాక్టర్ డ్రైవరైన శ్రీను తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. కాగా పోలీసులు తనచేత బలవంతంగా నేరాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని అతడు గట్టిగా అరిచాడు.