బాగా నచ్చిన ఫుడ్ కళ్లముందు ఉంటే ఏం చేస్తారు? ఎప్పుడు తినేదానికన్నా కాస్త ఎక్కువ క్వాంటిటీ తింటారు ఎవరైనా. కానీ, వీళ్లు మాత్రం అలా కాదు. వీళ్ల ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ వేస్టేజ్ని తగ్గించడం కోసం వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీలో కలిసారు. స్టార్టప్ బిజినెస్ పెట్టారు. సక్సెస్ చేశారు. దానిద్వారా ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నారు. అది 2019వ సంవత్సరం. కేరళ, ఎణ్నాకులంలో ‘వర్కింగ్ పర్సన్స్ కమ్యూనిటీ’ అనే వాట్సాప్ గ్రూప్ ఒకటుంది. అందులో 500 మందికి పైగా రిటైర్డ్, వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ గ్రూప్లో ప్రతి రోజూ రాజకీయం, సొసైటీ ప్రాబ్లమ్స్, యూత్ జాబ్స్ గురించి మాట్లాడుకునేవాళ్లు. అయితే, ఒక రోజు అనిల్ జోష్ అనే అతను ‘నాకు పనసతో చేసిన వంటలంటే చాలాఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం. రోజూ కొన్ని టన్నుల పనస వేస్ట్గా పడేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. దీన్ని ఎలాగైనా ఆపాలి’ అనే పోస్ట్ పెట్టాడు. గ్రూప్లో ఆ పోస్ట్ చదివిన చాలామంది రెస్పాండ్ అయ్యారు. ‘నాకూ చాలా ఇష్టం. కానీ, ఆ వేస్టేజ్ని ఆపాలంటే ఏం చేయాలి’ అని అడిగారు.
కొత్త వాట్సాప్ గ్రూప్ పెట్టి...
అలా రెస్పాండ్ అయినవాళ్లందరినీ కలిపి కొత్త వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు అనిల్. అందులో బిజినెస్ చేసేవాళ్లు, ఫొటో గ్రాఫర్స్, ఐటి, గవర్నమెంట్ ఎంప్లాయిస్, ఇంజనీర్స్, రైతులు ఇలా రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్లు ఉన్నారు. గ్రూప్లో ఉన్నవాళ్లంతా కలిసి బయట మీటింగ్స్ పెట్టుకునేవాళ్లు. ఆ మీటింగ్స్లో కేరళ రాష్ట్ర పండైన పనస గురించి చర్చించేవాళ్లు. రాష్ట్రంలో పనస ఉత్పత్తి బాగానే ఉన్నా, వాటిని తినేవాళ్లు తక్కువైపోయారు. దాంతో పనస వేస్టేజ్ బాగా పెరిగిపోతోంది. అంటే సంవత్సరానికి 60 కోట్ల పనస కాయల ఉత్పత్తి జరుగుతున్నా, దాంట్లో 10 శాతమే తింటున్నారు. మిగిలింది వేస్ట్గా పడేస్తున్నారు. చిన్నప్పుడు పనస కాయతో ఎన్ని రకాల వెరైటీలు చేసి తినేవాళ్లో ఆ మీటింగ్స్లో గుర్తుచేసుకునేవాళ్లు. అప్పుడే వాటివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి, ఈ కాలం వాళ్లకు తెలియజేయాలి అనుకున్నారు.
స్టార్టప్ ఆలోచనతో...
అప్పుడొచ్చిందే స్టార్టప్ ఆలోచన. ఈ విషయాన్ని అందరితో షేర్ చేశాడు అనిల్. అలా గ్రూప్లో ఉన్న సభ్యుల్లో 40 ఏండ్లుగా ఫుడ్ ఇండస్ట్రీలో పని చేస్తున్న విపిన్ కుమార్, 16 ఏండ్లుగా మార్కెటింగ్ ఫీల్డ్లో పని చేస్తున్న మను చంద్రన్, సభు అరవింద్, మాన్యుఫాక్చరింగ్ అండ్ కస్టమింగ్ మెషినరీలో ఎక్స్పర్ట్ అయిన బాబిన్ జోసెఫ్, కమర్షియల్ ఫొటోగ్రాఫర్ అశోక్ ఈ స్టార్టప్ ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలి అనుకున్నారు. వాళ్లతో కలిసి ‘చక్కకూట్టమ్’ అనే స్టార్టప్ని 2021లో మొదలుపెట్టాడు అనిల్. ‘చక్క’ అంటే మలయాళంలో ‘పనస’ అని, ‘కూట్టమ్’ అంటే ‘కమ్యూనిటీ’ అని అర్థం. ఈ బ్రాండ్ ద్వారా పనసతో చేసిన చిప్స్, పనస పిండి, హల్వాతో పాటు కూర చేసుకోవడానికి పచ్చి పనస పొట్టుని కూడా అమ్ముతున్నారు. రైతులు పండించినవే కాకుండా, ఇంట్లో కాసినవాటినీ కొంటున్నారు వీళ్లు. ఈ స్టార్టప్ వల్ల ఇప్పుడు వేస్టేజ్ కొంత తగ్గింది. పనస ప్రొడక్ట్స్ 100 నుంచి 1000 రూపాయల ధర వరకు అందుబాటులో ఉన్నాయి.