నాగర్కర్నూల్, వెలుగు: శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 884 అడుగులకు చేరడంతో కల్వకుర్తి లిఫ్ట్ స్కీంలో మొదటిదైన ఎల్లూర్ పంప్హౌజ్ డేంజర్లో పడింది. కృష్ణానదిలో వరద ఉధృతి కారణంగా ఎల్లూరు పంప్హౌజ్ సర్జ్పూల్పై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. నది నుంచి సర్జ్పూల్కు నీరు వచ్చే అప్రోచ్ కెనాల్ ముందుభాగాన ఇప్పటివరకు హెడ్ రెగ్యులేటర్ నిర్మించకపోవడమే ఇందుకు కారణం. హెడ్ రెగ్యులేటర్తోపాటు ప్రొటెక్షన్ వాల్ కూడా లేకపోవడంతో సర్జ్పూల్ ప్రమాదం అంచున ఉన్నట్లు ఇంజినీర్లు చెప్తున్నారు. 2004 నుంచి హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులు పెండింగ్లోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా దీనిపై దృష్టిపెట్టలేదు. రెండేండ్ల కింద ఎల్లూరు పంప్హౌజ్ నీట మునిగినప్పుడు హెడ్ రెగ్యులేటర్ నిర్మిస్తామని హడావిడి చేసిన సర్కారు ఆ తర్వాత పట్టించుకోలేదు.
రెండు సార్లు మునిగినా స్పందించని సర్కారు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 4.30లక్షల ఎకరాలకు సాగునీరు, 3వేలకుపైగా ఆవాసాలకు తాగునీరందించే కల్వకుర్తి లిఫ్టు స్కీమును అప్పటి కాంగ్రెస్ సర్కారు చేపట్టింది. ఇందులో భాగంగానే ఎల్లూరు పంప్హౌజ్ నిర్మించారు. అప్పటి కాంట్రాక్ట్ సంస్థకు, సర్కారుకు నడుమ అగ్రిమెంట్ కుదరకపోవడంతో అప్రోచ్ కెనాల్కు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం ఆపేశారు. అలా 2006లో ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు పెండింగ్పడిన ఈ పనులను ఆ తర్వాత తెలంగాణ సర్కారు సైతం పట్టించుకోలేదు. 2014లో శ్రీశైలంకు వచ్చిన భారీ వరదల కారణంగా పంప్హౌజ్లోకి నీరు చేరి ఐదు మోటార్లు మునిగిపోయాయి. అప్పుడు గేట్లు, హెడ్ వర్క్ ప్రపోజల్ వచ్చినా సర్కారు పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత 2020 అక్టోబర్లో ఎల్లూరు పంప్హౌజ్ బేస్మెంట్తో సహా పగిలిపోయి నీట మునిగింది. పాలమూరు– రంగారెడ్డి అండర్ టన్నెల్ బ్లాస్టింగ్వల్లే ఈ ప్రమాదం జరిగిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత అప్రోచ్ కెనాల్ ముందు వార్ఫూట్పై హెడ్ రెగ్యులేటరీ నిర్మిస్తామని టీఆర్ఎస్ సర్కారు హడావుడి చేసింది. 2021 ఏప్రిల్ లో అప్రోచ్ కెనాల్లో నీరు తోడేసి సర్జ్పూల్ టన్నెల్ ముందు 95 అడుగుల ఎత్తులో ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం, గేట్లు పెట్టాలని ఇంజనీర్లు ప్లాన్ చేశారు. కానీ ఈలోగా వర్షాకాలం ప్రారంభమైతే కృష్ణానదికి వరదలు వస్తాయని, ఆ తర్వాత పనులు కొనసాగించలేమని వదిలేశారు. ఆ తర్వాత ఏడాది గడిచిపోయినా హెడ్రెగ్యులేటర్ నిర్మాణం కోసం తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు.
ప్రమాదంలో పంప్హౌజ్
2020 అక్టోబర్లో మూడో పంపు స్టార్ట్ చేసిన ఐదు నిమిషాలకే భారీ శబ్దాలతో బేస్ నుంచి పైకి లేచింది. ఆ వెంటనే సర్జ్పూల్ వెంట్ల నుంచి దూసుకొచ్చిన నీటితో డ్యూటీలో ఉన్న సిబ్బంది చూస్తుండగానే పంప్హౌజ్ నీట మునిగింది. దాదాపు 35 రోజుల పాటు డీవాటరింగ్ చేశాక మూడో పంప్ పూర్తిగా డ్యామేజీ అయినట్లు తేల్చారు. ఐదో పంప్ మోటార్ కింద సర్జ్పూల్ నుంచి వచ్చే చానల్ గేట్ దగ్గర రంధ్రం పడినట్లు గుర్తించారు. ఒకటి, రెండు, నాలుగు పంపులను రెడీ చేసి ఒక దానిని స్టాండ్ బైలో ఉంచి కేవలం రెండు మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. దెబ్బతిన్న మూడోపంపు, వాడడానికి వీల్లేకుండా పోయిన ఐదో పంపును వినియోగంలోకి తేవడానికి ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీర్లు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించలేదు. బ్లాస్టింగ్ వల్ల ఐదో పంపు గేట్, సర్జ్పూల్ మధ్య ఏర్పడ్డ రంధ్రాన్ని పూడ్చేందుకు దాదాపు రూ.3 కోట్ల అంచనాతో చేపట్టిన పనులు కూడా వృథా అయ్యాయి. పంప్హౌస్ పరిస్థితి ఇలా ఉన్న టైంలో శ్రీశైలం రిజర్వాయర్ 884 అడుగులకు చేరడం, కృష్ణాలో వరద ఉధృతి పెరుగుతుండడంతో ఏ చిన్న లీకేజీ మొదలైనా పంప్హౌజ్ కుప్పకూలే ప్రమాదం ఉందని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.