
న్యూఢిల్లీ: దిగుమతులపై సుంకాలు పెంచి ఎల్లప్పుడూ ఇండియన్ కంపెనీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భావించొద్దని ఫైనాన్స్, రెవెన్యూ సెక్రెటరీ తుహిన్ కాంత పాండే అన్నారు. బడ్జెట్లో చాలా ప్రొడక్ట్లపై సుంకాలు తగ్గించామని, ఇండియా టారిఫ్ కింగ్ కాదనే విషయాన్ని తెలియజేస్తున్నామని వివరించారు. చైనా, మెక్సికో, కెనడా నుంచి చేసుకునే దిగుమతులపై యూఎస్ టారిఫ్లు పెంచిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు వివిధ ప్రొడక్ట్లపై కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం బడ్జెట్లో తగ్గించింది.
ముఖ్యంగా యూఎస్ నుంచే వచ్చే దిగుమతులపై సుంకాలు తగ్గాయి. సోలార్ మాడ్యూల్స్, హైఎండ్ మోటార్ సైకిల్స్పై సుంకాలకు కోత పెట్టారు. ప్రీమియం మోటార్సైకిల్స్పై డ్యూటీ తగ్గించాలని ట్రంప్ మొదటి టర్మ్ నుంచి యూఎస్ కోరుతోంది. మారిన సుంకాల రేట్లు ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చాయి. బడ్జెట్లో వేసిన ద్రవ్య లోటు, అప్పుల లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని పాండే పేర్కొన్నారు. రూ.12 లక్షల వరకు ట్యాక్స్ లేకపోవడంతో ప్రభుత్వానికి ఏడాదికి రూ. లక్ష కోట్ల లాస్ వస్తుందని అన్నారు. బ్రిక్స్ దేశాలు ఇంటర్నేషనల్ ట్రేడ్ కోసం డాలర్కు బదులు మరో కరెన్సీ తెస్తే 100 శాతం ట్యాక్స్ వేస్తామని యూఎస్ ప్రెసిడెంట్ ఇచ్చిన వార్నింగ్కు సమాధానం ఇచ్చారు. డాలర్ను మార్చే ఆలోచన లేదని అన్నారు.