- అలాంటి ఆలోచన లేదని తేల్చిన నిర్మలా సీతారామన్
- 68 శాతం పెరిగిన డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ
- ఇంకా రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం
- రూ. 52 వేల కోట్లు
- పార్లమెంట్లో ప్రకటించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: బిట్కాయిన్ను కరెన్సీగా గుర్తించే ప్రపోజల్స్ ఏవీ ప్రభుత్వం దగ్గర లేవని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలో జరిగే బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ల డేటాను సేకరించడం లేదని పార్లమెంట్లో ఆమె అన్నారు. బిట్కాయిన్ను కరెన్సీగా గుర్తించే ప్రపోజల్స్ ఏమైనా ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? అనే ప్రశ్నకు ఆమె ‘లేదు’ అని సమాధానమిచ్చారు. కాగా, ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021 ను ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని చూస్తోంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కొన్ని ప్రైవేట్ క్రిప్టోలకు అనుమతిచ్చి, మిగిలిన ప్రైవేట్ క్రిప్టోలను బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉంది. మరోవైపు ఆర్బీఐ డిజిటల్ రూపాయిని తెచ్చేందుకు అనుమతివ్వనుంది.
క్రిప్టో బిల్లు తెచ్చాక తీసుకునే చర్యలేంటో చెప్పండి: హైకోర్టు
క్రిప్టో కరెన్సీ బిల్లును ప్రవేశ పెట్టడం, ఆ తర్వాత తీసుకునే చర్యల గురించి తమకు చెప్పాలని బొంబాయి హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. జనవరి 17, 2022 న ఈ డిటెయిల్స్ను అందించాలని పేర్కొంది. ఏదైనా చట్టాన్ని చేయాలని పార్లమెంట్కు చెప్పలేమని చీఫ్ జస్టిస్ దీపాంకర్, జస్టిస్ ఎంఎస్ కార్నిక్లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. దేశంలో క్రిప్టో కరెన్సీలను వాడడానికి, ట్రేడ్ చేయడానికి వీలుగా ఒక చట్టాన్ని తీసుకొచ్చేలా కేంద్రాన్ని కోర్టు ఆదేశించాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) ను అడ్వకేట్ ఆదిత్య వేశారు. ఈ పిల్పై పై విధంగా హై కోర్టు స్పందించింది. క్రిప్టో కరెన్సీపై రెగ్యులేషన్స్ ఏవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లపై నెగెటివ్ ప్రభావం పడుతోందని, వారి సమస్యలను పరిష్కరించే మెకానిజం ఏదీ లేదని గుర్తు చేశారు. క్రిప్టో బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారని కేంద్ర తరపు న్యాయవాది చెప్పారు. కానీ, 2018, 2019 లో కూడా కేంద్రం ఇలానే చెప్పిందని, ఆ తర్వాత ఎటువంటి చర్యలేవి లేవని కడీమ్ వాదించారు. ఈ పిల్పై తదుపరి హియరింగ్ను జనవరి 17 కు కోర్టు వాయిదా వేసింది. ‘ఒక వేళ బిల్లును ఈ లోపే ప్రవేశ పెడితే తదుపరి చర్యలేంటో కేంద్రం చెప్పాలి’ అని కోర్టు పేర్కొంది.
ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది..
నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ (ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ వంటివి) ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 23 మధ్య 68 శాతం పెరిగిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. ఈ టైమ్ పిరియడ్లో నికరంగా రూ. 6.92 లక్షల కోట్ల డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చిందని అన్నారు. ఆర్థిక సంవత్సరం 2020–21లో ఇదే టైమ్ పిరియడ్లో నికరంగా రూ. 4.21 లక్షల కోట్ల డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే టైమ్లో రూ. 5.44 లక్షల కోట్ల రెవెన్యూని ప్రభుత్వం సేకరించగలిగింది. గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఈ ఏడాది ఏప్రిల్ 1–నవంబర్ 23 మధ్య రూ. 8.15 లక్షల కోట్లుగా ఉంది. ఇది అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే టైమ్ పిరియడ్తో పోలిస్తే 48.11 శాతం ఎక్కువ. కరోనా సంక్షోభం తర్వాత జీఎస్టీ కలెక్షన్ కూడా పెరుగుతూ వస్తోందని చౌదరి పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం 2020–21 లో రూ. 11.36 లక్షల కోట్లను జీఎస్టీ కింద ప్రభుత్వం సేకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు చూసుకుంటే రూ. 8.10 లక్షల కోట్లు వచ్చాయని చౌదరి అన్నారు. ఢిల్లీలో ట్యాక్స్ ఎగవేతలు పెరుగుతున్నాయా అనే ప్రశ్నకు దేశంలో ఎక్కడా పన్ను ఎగవేతలు జరగడం లేదని స్పష్టం చేశారు.
జీఎస్టీ పరిహారం ఇంకా పెండింగ్లో..
జీఎస్టీ పరిహారం కింద ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రాలకు ఇంకా రూ. 52 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని పంకజ్ చౌదరి పేర్కొన్నారు. 2020–21 లో రూ. 1,10,208 కోట్లను, 2021–22 లో రూ. 1.59 లక్షల కోట్లను రాష్ట్రాలకు లోన్స్ కింద సాయం చేశామని ఆయన అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఇంకా రాష్ట్రాలకు రూ. 51,798 కోట్లను రిలీజ్ చేయాల్సి ఉంది. ఇందులో రూ. 13,153 కోట్లు మహారాష్ట్రకు, రూ. 5,441 కోట్లకు ఉత్తరప్రదేశ్కు, రూ. 4,943 కోట్లు తమిళనాడుకి, రూ. 4,647 కోట్లు ఢిల్లీకి, రూ. 3,528 కోట్లు కర్నాటకకు ఇవ్వాల్సి ఉందని ఆయన పార్లమెంట్లో ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ నెల 3 న రాష్ట్రాలకు జీఎస్టీ కాంపన్సేషన్ ఫండ్ నుంచి రూ.17 వేల కోట్లను రిలీజ్ చేశామని చౌదరి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 43,303 కోట్లను జీఎస్టీ కాంపన్సేషన్ కింద రిలీజ్ చేశామని వివరించారు.
6,018 మందికి స్కిల్ లోన్స్ ..
ఈ ఏడాది అక్టోబర్ నాటికి సుమారు 6,018 మంది స్కిల్ లోన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్ను 2015, జులై 15 న ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐటీఐలు, పాలిటెక్నిక్లు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డులలో సీటు సంపాదించిన వ్యక్తులు ఈ స్కీమ్ కింద లోన్ పొందడానికి అర్హులు. వీరికి రూ. 5 వేలు నుంచి రూ. 1.50 లక్షల వరకు లోన్ను ఇస్తారు. ఈ అప్పును 3 నుంచి ఏడేళ్లలో తీర్చొచ్చు.
ప్రభుత్వానికి రూ. 5,155 కోట్ల డివిడెండ్..
నాలుగు ప్రభుత్వ కంపెనీల నుంచి గవర్నమెంట్కు రూ. 5,155 కోట్లు డివిడెండ్ కింద అందాయని డీఐపీఏఎం సెక్రెటరీ తుహిన్ కాంత పాండే ప్రకటించారు. ‘ప్రభుత్వానికి ఓఎన్జీసీ నుంచి రూ. 4,180 కోట్లు, బీపీసీఎల్ నుంచి రూ. 575 కోట్లు డివిడెండ్ కింద అందాయి’ అని ఆయన ట్వీట్ చేశారు. ఎస్పీఎంసీఐఎల్ నుంచి రూ. 240 కోట్లు, ఈసీజీసీ నుంచి రూ. 160 కోట్లు అందాయని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ కంపెనీల నుంచి రూ. 25,376.75 కోట్లు డివిడెండ్ల కింద గవర్నమెంట్కు అందాయని వివరించారు.