
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లాలోని వలస కార్మికుల పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగించి, ప్రత్యేక స్కూళ్లలో వారిని చదివిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం కలెక్టరేట్లో వలస కార్మికుల పిల్లలు, టీచర్లు, యజమానులతో కలెక్టర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వలస కార్మికుల పిల్లలు చదువుకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేక తరగతుల ద్వారా విద్యనందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఎంపిక చేసిన 16 స్కూళ్లలో 500 మంది విద్యార్థులకు స్పెషల్ టీచర్ల ద్వారా ఫిబ్రవరి నుంచి విద్యనందిస్తున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా ఇటుక బట్టీ ఓనర్లకు సర్టిఫికెట్లు ఇచ్చారు, టీచర్లను సన్మానించారు. అనంతరం జింకల పార్కు, ఉజ్వలపార్కు సందర్శనకు తీసుకెళ్లారు.
కొత్తపల్లి, వెలుగు: ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు 500 మంది టీచర్లకు ఈ నెల 13 నుంచి 17వరకు కొత్తపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విభిన్న అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
గురువారం శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ టీచర్లపై బోధనాపరమైన బాధ్యతలే కాకుండా విద్యార్థుల సంరక్షణ బాధ్యతలు కూడా ఉంటాయన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ విద్యార్థులకు టీచర్లు ఆదర్శంగా నిలవాలన్నారు. సమాజంలో జరుగుతున్న నేరాలు, రక్షణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో డీఈవో జనార్దన్ రావు, ఎన్వైకే కోఆర్డినేటర్ రాంబాబు, క్వాలిటీ కో ఆర్డినేటర్ కర్ర అశోక్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్రెడ్డి, గంగాధర ఎంఈవో ప్రభాకర్ రావు, ఇటుక బట్టీ యజమానుల సంఘం అధ్యక్షుడు హరిచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.