ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఎస్పీ రాహుల్​హెగ్డే 

తంగళ్లపల్లి, వెలుగు:  పోలీసులు క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో  ఆర్మ్​డ్​ రిజర్వ్, సివిల్ పోలీస్  సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. పరేడ్ లో ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ..  ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు ఉదయాన్నే కనీసం అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి చేయాలన్నారు. పరేడ్ లో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ లు కుమార స్వామి, రజినీకాంత్, యాదగిరి, సీఐ లు అనిల్ కుమార్, ఉపేంద్, నవీన్ కుమార్, లింగమూర్తి పాల్గొన్నారు...

సీఎం కేసీఆర్​ ఫొటోకు క్షీరాభిషేకం

సిరిసిల్ల టౌన్, వెలుగు: ఆరు నుంచి 10శాతం రిజర్వేషన్లు  పెంచినందుకు గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్  విగ్రహానికి పూలమాలవేసి, సీఎం కేసీఆర్, మంత్రి  కేటీఆర్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్​ అరుణ చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ చైర్మన్​ శంకరయ్య, వీర్నపల్లి జడ్పీటీసీ కళావతి, ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్​నాయక్, రాజు నాయక్, శంకర్​నాయక్​ పాల్గొన్నారు. 

కోనరావుపేట, వెలుగు: కోనరావుపేట మండలంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్​ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు దేవయ్య, సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు పర్శరాములు, సర్పంచ్​ప్రమీల, లీడర్లు జగన్ నాయక్, ప్రవీణ్ నాయక్, టీఆర్ఎస్వీ నాయకుడు రమణారెడ్డి పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే సొసైటీల ధ్యేయం

ఎల్లారెడ్డిపేట,వెలుగు: రైతు సంక్షేమమే ధ్యేయంగా సింగిల్ విండో సొసైటీలు పనిచేస్తున్నాయని ఎల్లారెడ్డిపేట ప్యాక్స్​చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో ఆఫీసులో  లాంగ్​టర్మ్​లోన్ల చెక్కులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరచడానికి  లాంగ్​టర్మ్​ లోన్లు సొసైటీ ద్వారా అందజేస్తున్నామన్నారు.  కార్యక్రమంలో వైస్ చైర్మన్ జంగిటి సత్తయ్య, డైరెక్టర్లు నేవూరి వెంకట నరసింహారెడ్డి, ఇన్​చార్జి సీఈవో  నాగవేణి పాల్గొన్నారు.

ఫర్టిలైజర్స్​ అసోసియేషన్​ అధ్యక్షునిగా మధుసూదన్​ 

జమ్మికుంట, వెలుగు : జమ్మికుంట మండల ఫర్టిలైజర్స్​అసోసియేషన్​ ఎన్నికలు శనివారం జరిగాయి. అధ్యక్షునిగా గజవెల్లి మధుసూదన్​, జనరల్​సెక్రటరీగా చిదురాల భాస్కర్​, ఉపాధ్యక్షులుగా దోమకుంట్ల రవి, చిదురాల విజేందర్​, మాడిజ్యోతి మహేందర్​ ఎన్నికయ్యారు. జాయింట్​సెక్రటరీలుగా దోమకుంట్ల రమేశ్, పోల్సాని రఘురావు, వీరేశలింగం, జగదీశ్వర్లు ఎన్నికైనట్లు బుర్ర మల్లిఖార్జున్​, ఓల్లాల సంపత్​ తెలిపారు. 

సిరిసిల్లకు స్వచ్ఛ సర్వేక్షణ్​ అవార్డు 

సిరిసిల్ల టౌన్, వెలుగు:  స్వచ్ఛ సర్వేక్షణ్​2022 అవార్డులలో సౌత్​ జోన్​లో లక్షలోపు జనాభా మున్సిపాలిటీల విభాగంలో  సిరిసిల్లకు సెల్ఫ్​కన్సిస్టెంట్​నగరంగా  అవార్డు  లభించింది. శనివారం ఢిల్లీలో నిర్వహించిన అవార్డు ల ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్  చేతుల మీదగా మంత్రి కేటీఆర్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, మున్సిపల్  కమిషనర్ సమ్మయ్య అవార్డును అందుకున్నారు. 

కొత్తపల్లి మున్సిపాలిటీకి..

కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ క్లీన్ సిటీ అవార్డుకు ఎంపికైంది. 25 వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో సౌత్ జోన్ లో అవార్డు వచ్చినట్లు మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా చైర్మన్ రుద్ర రాజు, కమిషనర్ వేణుమాధవ్, సీడీఎంఏ సత్యనారాయణ ఈ అవార్డును అందుకున్నారు.  

తంగళ్లపల్లి రైటర్ సస్పెండ్

తంగళ్లపల్లి, వెలుగు: అవినీతి ఆరోపణలు రావడంతో తంగళ్లపల్లి పోలీస్​స్టేషన్​రైటర్ సస్పెండ్ అయ్యాడు. తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్​లో రైటర్​గా పనిచేస్తున్న శంకర్ పై ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతని ఇంటి నిర్మాణానికి ఇసుక సరఫరా చేయలేదనే కోపంతో ఓ టిప్పర్​ఓనర్ ను బెదిరించినట్లు సమాచారం. మరుసటి రోజు టిప్పర్ ఓనర్ గతంలో శంకర్ కు ఆన్​లైన్​లో పంపిన డబ్బుల సమాచారం బయటకు రావడంతో పోలీస్ ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. శంకర్ పై ఆరోపణలు నిజమని తేలడంతో ఎస్పీ రైటర్ శంకర్ ను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

హైకోర్టు జడ్జిని కలిసిన లాయర్లు

కరీంనగర్ సిటీ, వెలుగు: హైకోర్టు జడ్జి జస్టిస్​ పుల్లా కార్తీక్​​ను శనివారం కరీంనగర్​జిల్లా కోర్టులోని జుడిషియల్ గెస్ట్​ హౌజ్​లో  తెలంగాణ స్టేట్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్​ సలహా మండలి సభ్యుడు పి.వి.రాజ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్జి పుల్లా కార్తీక్​ జగిత్యాల వాస్తవ్యులు. ఇటీవల జడ్జిగా బాధ్యతలు చేపట్టి  మొదటిసారి కరీంనగర్ వచ్చారు. కార్యక్రమంలో లాయర్లు టి. వేణుగోపాల్, బుద్ద గోపాల్, ప్రభాకర్ పాల్గొన్నారు.

సుల్తానాబాద్ పీఏసీఎస్ ​దేశంలోనే ఉత్తమం

టెస్కాబ్​ చైర్మన్ కొండూరు రవీందర్ రావు

సుల్తానాబాద్, వెలుగు: వ్యవసాయ భూముల అభివృద్ధి కోసం రైతులకు కొత్తగా కర్షకమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టినట్లు టెస్కాబ్​చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు. సుల్తానాబాద్ పీఏసీఎస్​ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ బాటిల్ ప్లాంట్ ను, కమర్షియల్ కాంప్లెక్స్ రూమ్​లను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్​రావు మాట్లాడుతూ రూ. 35 కోట్ల లాభాన్ని ఆర్జించి, రైతులకు సేవలు అందిస్తున్న సుల్తానాబాద్ పీఏసీఎస్​దేశంలోనే ఉత్తమ సంఘంగా గుర్తింపు పొందిందని అన్నారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి సంఘాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. సంఘం చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఎంపీపీ బాలాజీ రావు, జడ్పీటీసీ స్వరూప, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, డీఏవో ఆదిరెడ్డి, డీసీవో మైకేల్ బోస్, సింగిల్ విండో చైర్మన్లు మోహన్ రావు, గడ్డం మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. 

మెట్​పల్లిలో బోనాలు

 మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి పట్టణంలో మున్నురుకాపు సంఘం, పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో పోచమ్మతల్లి, భూదేవి మాత, త్రిశక్తి అమ్మవారికి వైభవంగా బోనాలు సమర్పించారు. శనివారం పటేల్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం నుంచి మహిళలు బోనాలు ఎత్తుకొని పాత బస్టాండ్ నుంచి త్రిశక్తి ఆలయం వరకు వెళ్లి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుప్పాల లింబాద్రి,  బొడ్ల రమేష్, బొడ్ల ఆనంద్, ప్రభాకర్, నరేశ్, రాజు, గౌతమ్, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న కళోత్సవాలు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ కళోత్సవాలు రెండోరోజు శనివారం అంగరంగ వైభవంగా కొనసాగాయి. శనివారం సాయంత్రం కళోత్సవాల్లో మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....కరీంనగర్ కళాకారులకు నిలయమన్నారు. చరిత్రలో కరీంనగర్ కు అపురూపమైన స్థానముందని గుర్తు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను కళాకారుల ప్రదర్వనల ద్వారా తెలుసుకుంటున్నామన్నారు.

రాష్ట్రం లో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అప్పుడే సాధించుకున్న తెలంగాణ కల సార్థకమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందన్నారు. కళాకారుల ఆటపాటలతో స్టేడియం దద్దరిల్లింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‍రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి , అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, కార్పొరేటర్లు వేణు, శ్రీకాంత్ 
తదితరులు పాల్గొన్నారు. 

ముగిసిన బతుకమ్మ వేడుకలు

హాజరైన గవర్నర్​ తమిళిసై

వేములవాడ, వెలుగు : సద్దుల బతుకమ్మ వేడుకలు వేములవాడ పట్టణంలో  శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి.  ఈ వేడుకలకు గవర్నర్ తమిళిసై హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. అనంతరం శ్రీరాజరాజేశ్వరస్వామివారి సన్నిధిలో  ప్రత్యేక పూజలు చేశారు.  వేడుకల్లో జడ్పీ చైర్​పర్సన్​ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్యే రమేశ్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప  రామకృష్ణ, జడ్పీ మాజీ చైర్​పర్సన్ తుల ఉమ  తదితరులు పాల్గొన్నారు.  

రాజన్న ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: గవర్నర్​

రాజన్న ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గవర్నర్​ తమిళిసై అన్నారు.  వేములవాడ సద్దుల బతుకమ్మ వేడుకలకు రావడం సంతోషంగా ఉందన్నారు. వెయ్యేండ్ల చరిత్ర గల వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ఎంతో శక్తివంతమైందన్నారు. రాజన్న ఆలయం తెలంగాణకే గర్వకారణమని రాజన్న ఆలయం అభివృద్ది చెందడానికి తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు.

వయోవృద్ధులను ఆదరించాలి

కరీంనగర్ సిటీ, వెలుగు: వయోవృద్ధులను ఆదరించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లో మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అర్బన్, పీహెచ్​సీల్లో వారానికి ఒకరోజు వయోవృద్ధులకు ప్రత్యేకంగా  వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టం ద్వారా సత్వర న్యాయం జరిగే అవకాశముందన్నారు. పిల్లల సంరక్షణకు, నిరాదరణకు గురైన వృద్ధులు ఆర్డీవోకు ఫిర్యాదు చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ ఆస్తులను పిల్లలకు ఇచ్చేటప్పుడు తమను పట్టించుకోకపోతే గిఫ్ట్ డీడ్ చెల్లదని కండీషన్​ పెట్టాలన్నారు. అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, అధికారులు ఆనంద్ కుమార్, సబిత పాల్గొన్నారు. 

చొప్పదండి టౌన్​ ‘మాస్టర్​ ప్లాన్’ సమావేశం

చొప్పదండి, వెలుగు: చొప్పదండి మున్సిపాలిటీ ఆఫీస్​లో శనివారం టౌన్​మాస్టర్​ ప్లాన్​ ప్రిపరేషన్​మీటింగ్​జరిగింది. చైర్​పర్సన్ గుర్రం నీరజ అధ్యక్షతన జరిగిన మీటింగ్​లో టౌన్​లోని మౌలిక వసతులు, చెరువులు, రోడ్లు, సైడ్​డ్రైన్లు, సబ్ స్టేషన్, హై టెన్షన్ కరెంట్​వైర్లు, మెయిన్​జంక్షన్ల అభివృద్ధి,  ప్రభుత్వ భూములు, ఆఫీసులు, డబుల్ బెడ్రూం ఇండ్లు, డంప్ యార్డు, శ్మశాన వాటికలు, మున్సిపల్ పార్కులు, నర్సరీలు, ఇంటిగ్రేటెడ్​మార్కెట్లు, క్రీడా ప్రాంగణాలు, ట్యాంక్ బండ్, ఫైర్ స్టేషన్,  పబ్లిక్ టాయిలెట్స్, స్కూల్స్, హాస్పిటల్స్, చారిత్రక ప్రదేశాలు.. తదితర వివరాలను మాస్టర్​ప్లాన్ లో చేర్చడంపై చర్చించారు. కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కౌన్సిల్లర్లు శ్రీనివాస్, మహేశ్, మున్సిపల్ కమిషనర్ పి.శాంతి కుమార్, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి, చొప్పదండి ఏఈ భూమయ్య, మేనేజర్ డి. ప్రశాంత్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ నేత

రామగిరి,వెలుగు:  అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. శనివారం మంథని మండలం కన్నాల, రామగిరి మండలం సింగరెడ్డిపల్లి, అర్జీ-3 పరిధిలోని ఏఎల్​పీ మైన్, కమాన్ పూర్ మండలంలోని పెరపల్లి, రొంపి కుంట గ్రామాల్లో అమ్మవార్లను సునీల్​రెడ్డి దర్శించుకున్నారు. ఆయన వెంట నాయకులు జంగపల్లి అజయ్, మచ్చగిరి రాము, అర్కుల ప్రసాద్ గౌడ్, పెద్దోళ్ల ఐలయ్య, అరుణ్, సతీష్, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.

రజక సంఘ నాయకులకు సన్మానం

ఎల్లారెడ్డిపేట, వెలుగు: రజక సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియామకమైన లోకుర్తి బాలమల్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గొల్లపల్లి మల్లేశంను శనివారం ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో రజక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో  సంఘ నాయకులు పెద్దూరి మల్లయ్య, అక్కపురం దేవయ్య పాల్గొన్నారు. 

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

తంగళ్లపల్లి,వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎలుగుమెట్ల జనార్దన్ రెడ్డి, లక్ష్మి దంపతుల చిన్న కొడుకు పర్శరాం రెడ్డి(28) హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. శనివారం ఉదయం ఇంట్లో అనుమానాస్పదస్థితిలో చనిపోయాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలే పర్శరాంరెడ్డి మృతికి కారణం కావొచ్చని గ్రామస్థులు భావిస్తున్నారు. అతడి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్​కు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై అంజయ్య తెలిపారు.

కొలిమికుంటలో పింఛన్ల పంపిణీ 

చొప్పదండి, వెలుగు: మండలంలోని కొలిమికుంట గ్రామంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లను లబ్ధిదారులకు సర్పంచ్ తాళ్లపల్లి సుజాత, ఎంపీటీసీ తోట కోటేశ్​పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులు, టీఆర్ఎస్​ నాయకులు.. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రవిశంకర్ ఫోటోకు క్షీరాభిషేకం చేశారు. ఉప సర్పంచ్ తిరుపతి, మల్లేశం, శ్రీనివాస్​గౌడ్, మహేందర్, తిరుపతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.