న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలు తనకు ఎన్ని సమన్లు ఇస్తే.. అన్ని పాఠశాలలను తెరుస్తానని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేజ్రీవాల్కు ఇప్పటి వరకు ఐదు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను దేశంలోనే అతిపెద్ద టెర్రరిస్ట్గా భావిస్తున్నదని, అన్ని దర్యాప్తు ఏజెన్సీలను తనపైకి ఎగదోసిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ 3లో మరో ప్రభుత్వ పాఠశాల భవనానికి కేజ్రీవాల్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని.. ఆ లక్ష్యాన్ని సాధించడానికే తమ ప్రభుత్వం ఢిల్లీలో ఒకదాని తర్వాత మరో పాఠశాలను ప్రారంభిస్తోందని చెప్పారు.