- బ్రాండ్ పబ్లిసిటీ, మార్కెటింగ్ సపోర్ట్
- ఎస్హెచ్జీలకు బ్యాంకు లింకేజీ లోన్లు
- రాష్ట్రవ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్
- 140 వ్యాపార సంస్థలకు చేయూత
మంచిర్యాల, వెలుగు: ‘ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రానికి చెందిన పద్మ వ్యాపారంలో రాణించాలనే పట్టుదలతో బేకరీ ఏర్పాటు చేసుకున్నారు. సొంతంగా బట్టీ పెట్టి వివిధ రకాల ఐటమ్స్ తయారు చేసి విక్రయించేవారు. కానీ, సరైన మార్కెటింగ్ నైపుణ్యాలు లేకపోవడం వల్ల బిజినెస్ ఆశించిన స్థాయిలో నడవలేదు. దీనికితోడు తన కొడుకు యాక్సిడెంట్లో గాయపడి కొన్ని నెలల పాటు మంచంలో ఉన్నాడు. దీంతో వ్యాపారం బంద్ చేయాల్సి వచ్చింది.
’ ఇలా అనేక మంది మహిళలు బిజినెస్లో అభివృద్ధి సాధించాలనే తపన ఉన్నా సరైన గైడెన్స్ లేకపోవడంతో డీలా పడుతున్నారు. అటువంటి వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రం అమలు చేస్తున్న రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ ఫర్ఫార్మెన్స్(ర్యాంప్) స్కీమ్లో భాగంగా విమెన్ ఎంట్రాప్రెన్యూర్స్ హబ్(వీహబ్) ద్వారా అవసరమైన సపోర్ట్ అందిస్తోంది.
వ్యాపారాభివృద్ధికి చేయూత..
ఫుడ్ ప్రాసెసింగ్, మాన్యుఫ్రాక్చరింగ్, ఎఫ్ఎంసీజీ, చేనేత, వస్ర్త పరిశ్రమ, హస్తకళలు వంటి వ్యాపారాల నిర్వహణకు మహిళలు ఉత్సాహం చూపుతున్నారు. కానీ, వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఆధునిక మెషినరీ, టెక్నాలజీ, బ్రాండ్ పబ్లిసిటీ, మార్కెటింగ్ స్కిల్స్ ఉంటేనే సాధ్యం. విమెన్ ఎంట్రాప్రెన్యూర్స్లో ఈ లోపాలను గుర్తించిన ప్రభుత్వం విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం ద్వారా వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటోంది.
టైర్ 2, 3 ప్రాంతాల్లో మహిళల నేతృత్వంలో నడుస్తున్న ఎక్కువ కెపాసిటీ కలిగిన ఎంఎస్ఎంఈలను గుర్తించి వారికి అవసరమైన సపోర్ట్ అందిస్తోంది. ఒక ప్రొడక్ట్ను ఎలా తయారుచేయాలి? దానిని బ్రాండింగ్ ఎలా చేయాలి? ప్రజలకు చేరువయ్యేందుకు ఎలా పబ్లిసిటీ చేయాలి? మార్కెటింగ్ విస్తరణ కోసం ఏమేం చేయాలి? వంటి అంశాలపై వీహబ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ఎస్హెచ్జీ సభ్యులకు డీఆర్డీఏ ద్వారా బ్యాంక్ లింకేజీ లోన్లు కూడా ఇప్పిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 140 సంస్థల ఎంపిక..
రాష్ట్రవ్యాప్తంగా 300 మంది మహిళల నేతృత్వంలో నడుస్తున్న ఎంఎస్ఎంఈల్లో 140 సంస్థలను వీహబ్ ద్వారా ఎంపిక చేసి వ్యాపారాభివృద్ది నైపుణ్యాలను అందిస్తున్నారు. వారిని విమెన్ ఎంట్రాప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతున్నారు. దీని కోసం జిల్లాల వారీగా అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మంచిర్యాలలో జరిగిన కార్యక్రమంలో 120 మంది మహిళా వ్యాపారవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
చాలామంది ఫ్లోర్మిల్స్, పికిల్స్, స్వీట్స్, బేకరీ, ఎంబ్రాయిడరీ, గానుగ నూనె, హోమ్ ఫుడ్స్, మిల్క్, డెయిరీ ప్రొడక్ట్స్, పుట్టగొడుగుల పెంపకం వంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారిలో వ్యాపార విస్తరణపై ఆసక్తి ఉన్నవారిని సెలెక్ట్ చేసి వీహబ్ ద్వారా తగిన ప్రోత్సాహం అందించనున్నట్టు అధికారులు తెలిపారు. వీహబ్ సపోర్ట్ కోసం శ్రీకర్ 8125508355 నంబర్లో సంప్రదించవచ్చు.
ప్రోత్సాహం అందిస్తే వ్యాపారాభివృద్ధి
నేను ఏదైనా బిజినెస్ చేయాలనే పట్టుదలతో 2022లో మల్లికార్జున ఫ్లోర్స్ మిల్స్ ఏర్పాటు చేశాను. జొన్నపిండి, గట్క, మక్క గట్క, గోధుమ పిండి, మల్టీగ్రెయిన్ పిండి, కారం, పసుపు గిర్నీ పట్టి కిలో, అర కిలో ప్యాకింగ్ చేసి అమ్ముతున్నాను. వీటికి అవసరమైన ముడిసరుకులను మంచిర్యాల, చెన్నూర్, మహారాష్ట్రలో కొనుగోలు చేస్తున్నా. మార్కెట్లో లభించే వాటి కంటే క్వాలిటీగా, అంతకంటే తక్కువ ధరకే అమ్ముతున్నాను.
ప్రస్తుతం ఖర్చులు పోగా నెలకు రూ.8 వేల దాకా మిగులుతున్నయ్. రానున్న రోజుల్లో కందిపప్పు, పెసరపప్పు తయారు చేయాలనుకుంటున్నా. వీహబ్ ద్వారా బ్రాండింగ్, పబ్లిసిటీ, మార్కెటింగ్ సపోర్టు అందిస్తే నా వ్యాపారాన్ని విస్తరించి మరో నలుగురికి ఉపాధి కల్పిస్తా.– రేణుక, రామారావుపేట, జైపూర్ మండలం
