రేషన్ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత జ్యోతిప్రియ మల్లిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ ) అధికారులు గురువారం అర్థరాత్రి అరెస్టు చేశారు. కోల్కతా శివార్లలోని సాల్ట్ లేక్లోని మంత్రి నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టాయి. దాదాపుగా 20 గంటలు ప్రశ్నించిన అనంతరం మల్లిక్ అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు .
రేషన్ పంపిణీలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ను అరెస్టు చేసినట్లుగా ఈడీ అధికారులు వెల్లడించారు. మల్లిక్ ప్రస్తుతం అటవీ వ్యవహారాల రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. గతంలో ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. మల్లిక్ అరెస్టు సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్లను మోహరించారు. ‘నేను కుట్రలో బాధితుడిని’ అని తనను అదుపులోకి తీసుకున్న సమయంలో మంత్రి వ్యాఖ్యానించారు.
అయితే ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈడీ దాడుల వల్ల మంత్రికి ఏమైనా జరిగితే బీజేపీ, ఈడీపై మేం కేసులు పెడతామంటూ వ్యాఖ్యలు చేశారు.