రా. 7 నుంచి డీడీ స్పోర్ట్స్లో
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్): తొలి వన్డేలో ఆఖరి బాల్కు గట్టెక్కిన టీమిండియా ఆదివారం రాత్రి వెస్టిండీస్తో జరిగే రెండో వన్డేలో పోటీ పడనుంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అంతకంటే ముఖ్యంగా తొలి పోరులో నిరాశ పరిచిన మిడిలార్డర్ బ్యాటర్లు పుంజుకోవాలని ఆశిస్తోంది. పలువురు సీనియర్ల గైర్హాజరీలో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన ధవన్ కెరీర్ నిలబెట్టుకునే ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. షార్ట్ ఫార్మాట్లో ఓపెనర్గా వచ్చిన చాన్స్ను గిల్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. 19 నెలల తర్వాత తొలి వన్డే ఆడిన అతను దూకుడైన బ్యాటింగ్తో అలరించాడు. వన్డౌన్లో శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్చూపెట్టాడు. కాబట్టి ఈ మ్యాచ్లోనూ ఈ ముగ్గురు కొనసాగడం ఖాయమే. అయితే, టాప్-–3 బ్యాటర్లంతా హాఫ్ సెంచరీలు కొట్టడంతో 350 స్కోరు చేసేలా కనిపించిన ఇండియా మిడిలార్డర్ కుప్పకూలడంతో దాదాపు 50 రన్స్ తక్కువ చేసింది. అందుకే విజయం కోసం చివరి బాల్ వరకూ పోరాడాల్సి వచ్చింది.
ముఖ్యంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సంజూ శాంసన్ తొలి వన్డేలో నిరాశ పరిచాడు. జట్టులో ప్రతీ చోటుకు తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో బ్యాట్ ఝుళిపించకపోతే ఇతరులకు తను దారి వదలాల్సి ఉంటుంది. రెండో మ్యాచ్లో సంజూతో పాటు సూర్యకుమార్, దీపక్ హుడా, అక్షర్ పటేల్పై కూడా ఫోకస్ ఉంది. జడేజా గైర్హాజరీలో హుడాను ధవన్ పార్ట్టైమ్ స్పిన్నర్ గా ఉపయోగించుకున్నాడు. చహల్ కంటే ముందే బౌలింగ్కు వచ్చిన హుడా వికెట్లు తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్లో సిరాజ్, శార్దూల్, చహల్ సత్తా చాటినప్పటికీ.. విండీస్ 300 స్కోరు చేసిందంటే మన బౌలింగ్లో లోపాలు ఉన్నట్టే. వాటిని సరిదిద్దుకొవాల్సి ఉంటుంది. ఇక, వరుసగా ఏడో వన్డేల్లో ఓడిన విండీస్ ఈ మ్యాచ్తో అయినా గెలుపు బాట పట్టాలని కోరుకుంటోంది. గత మ్యాచ్లో ఇండియాకు గట్టి పోటీ ఇవ్వడం ఆతిథ్య జట్టులో ఆత్మవిశ్వాసం పెంచే విషయమే. నాణ్యమైన బౌలింగ్ను ఎదుర్కొని 300 స్కోరు చేసిన కరీబియన్లను ఇండియన్స్తక్కువగా అంచనా వేయడానికి లేదు.