‘వ్యాక్సిన్ వేసుకున్నాం. ఇక కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు’ అనే భరోసా లేదు. ఎందుకంటే కరోనా నుంచి కోలుకున్నవాళ్లే కాకుండా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. చాలామందిలో ‘లాంగ్ కొవిడ్’ కాంప్లికేషన్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు న్యూరో సర్జన్ రంగనాధం.
కరోనా వచ్చి, తగ్గినంక మొత్తం మారిపోయింది. అడపాదడపా వచ్చే ఆరోగ్య సమస్యలు నెలలు, సంవత్సరం అయినా కూడా చాలామందిలో అలానే ఉంటున్నాయి. ఇలా ఉండడాన్నే ‘లాంగ్ కొవిడ్’ అంటున్నారు. మనదగ్గరనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న చాలామంది ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నారు. వెంటిలేటర్ ట్రీట్మెంట్ తీసుకున్నవాళ్లలోనే లాంగ్ కొవిడ్ సింప్టమ్స్ ఉంటాయనేది అపోహ. అలాగే, వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన కొవిడ్ నుంచి పూర్తి రక్షణ ఉంటుంది అనుకోవడమూ పొరపాటే. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది కరోనాకి మెడిసిన్ కాదు.
ఈ లక్షణాలు కనిపిస్తాయి
లాంగ్ కొవిడ్లో ఊపిరితిత్తుల్లో ఉండే స్పాంజి లాంటి అల్యువిలోలై కండరాలు డ్యామేజి అవుతాయి. దాంతో ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాస సరిగ్గా జరగవు. దాంతో, తొందరగా ఆయాసం వస్తుంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కొందరైతే డిప్రెషన్ బారిన పడతారు. కరోనా టైంలో ఫ్యామిలీకి దూరంగా ఉండడం వల్ల యాంగ్జైటీ పెరుగుతుంది. మొత్తంగా చూస్తే... కరోనా నుంచి కోలుకున్న కొందరిలో ‘పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ సిండ్రోమ్’ కనిపిస్తోంది. మరికొందరిలో నిద్ర లేమి, పని మీద ధ్యాస తగ్గడం, కండరాల నొప్పి వంటివి కొన్ని వారాలు, నెలల పాటు ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న పదిశాతం మందిలో ఇప్పటికీ వాసన, రుచి తెలియడం లేదు.
మెడిసిన్ లేదు
లాంగ్ కొవిడ్కి ఫలానా మెడిసిన్ అంటూ లేదు. లాంగ్ కొవిడ్ లక్షణాలు నెమ్మదినెమ్మదిగా తగ్గిపోతాయి. కండరాల నొప్పి ఉంటే పారాసిటమాల్ వేసుకోవాలి. అంతే తప్ప స్టిరాయిడ్స్ పరిష్కారం కాదు. కొందరిలో ‘గిల్లెన్ బ్యారీ సిండ్రోమ్’ వస్తుంది. ఈ సమస్య ఉన్నవాళ్లకి వెంటిలేటర్పై ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది.
లాంగ్ కొవిడ్ సమస్యలు రాకుండా ఉండాలంటే... హాస్పిటల్ వాళ్లు రికవరీ అయిన పేషెంట్స్ అడ్రస్ తీసుకోవాలి. ఎందుకంటే కరోనా రికవరీ పేషెంట్స్ ఫాలో–అప్ అనేది చాలా ముఖ్యం. కానీ, చాలామంది మళ్లీ డాక్టర్ని కలవడం లేదు.
మళ్లీ రాకుండా..
కరోనా తగ్గిన తర్వాత కూడా కొందరిలో జలుబు లక్షణాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి. కానీ, ఎవ్వరూ అలా చేయడం లేదు. కళ్లు ఎర్రబడడం, చెంప ఎముక నొప్పి, ఊపిరితిత్తుల్లో ఇబ్బంది అనిపించినప్పుడు మాత్రమే డాక్టర్ని కలుస్తున్నారు. అప్పటికే బ్లాక్ఫంగస్ (మ్యూకార్ మైకోసిస్) శరీరంలోని చాలా భాగాల్లో తిష్ట వేస్తోంది. ఈ ఫంగల్ స్పోర్లు ముక్కు ద్వారా ప్రవేశించి, తర్వాత ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. ఈ ఫంగస్ ఎముకల్ని తినేస్తుంది. కన్ను, దవడ ఎముక... వంటి భాగాలు దెబ్బతింటాయి. అంతేకాకుండా రక్తంలోకి చేరి, రక్తనాళాల్ని ముక్కలు చేస్తుంది. ఈ కారణంగానే హార్ట్స్ట్రోక్, లంగ్ డ్యామేజీ వంటి సమస్యలు వస్తాయి.
ఇమ్యూనిటీ పెరగడానికి
రోగనిరోధక శక్తి పెరగాలంటే ఫుడ్ని మించిన మెడిసిన్ లేదు. అందుకే, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు వంటివి ఎక్కువ తినాలి. రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం మర్చిపోవద్దు.