
ఎక్కువ బరువుని కంట్రోల్ చేయడానికి బోలెడన్ని డైట్ ప్లాన్లు, ఎక్సర్సైజ్లు.. స్పెషల్ డ్రింక్లు. అంగుళం కొవ్వు పెరిగినా కరిగించడానికి ఇంటర్నెట్లో వేలకొద్ది సలహాలు, సూచనలు. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా! అంటూ గల్లీకో వెయిట్ లాస్ సెంటర్. ఇదంతా బాగానే ఉందిగానీ.. మరి అండర్ వెయిట్ బాధితుల మాటేంటి?. ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. దీనికోసం స్పెషల్ డైట్స్ ఏమైనా ఉన్నాయా? అని చూస్తే ‘ ఇది కూడా ఓ సమస్యా’ అనే వాళ్లే ఎక్కువమంది. కడుపునిండా తింటే చాలని కొందరు అంటే… ఒళ్లు కదలకుండా కూర్చుంటే ఈజీగా బరువు పెరగొచ్చని మరికొందరు సలహాలిస్తుంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కేజీ కండ కూడా రాదు.
బరువు తగ్గాలంటే కష్టం గానీ పెరగటం కష్టమా అని చాలా మందికి అనిపిస్తుంటుంది. కాని కొందరు ఎంత ప్రయత్నించినా బరువు పెరగరు. బరువు పెరగాలన్నా పెద్ద కసరత్తులే చేయాల్సి ఉంటుంది.
కారణం తెలుసుకోవాలి
సాధారణంగా వయసుని బట్టి ఎత్తుండాలి. ఎత్తుకి సరిపడా శరీర బరువుండాలి. కానీ ప్రజంట్ జనరేషన్లో పోషకాల లోపం , జీన్స్, హార్మోన్స్ అసమతుల్యత, సరైన ఆహారం తీసుకోకపోవడం, సమయానికి తినకపోవడం, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు.. ఇలా వివిధ కారణాల వల్ల ఎత్తుకి సరిపడా బరువు ఉండటం లేదు. కొంతమందిలో బరువు పెరగకపోవడానికి రక్తహీనత లాంటి జబ్బులు కూడా కారణం కావొచ్చు. అందువల్ల ముందుగా ఏ కారణం చేత బరువు పెరగడం లేదో తెలుసుకోవాలి. డాక్టర్ని సంప్రదించి టెస్ట్లు చేయించుకోవాలి. ఎలాంటి సమస్యా లేదని తేలితే అప్పుడు ఆహారపు అలవాట్లే కారణం అని నిర్ధారణకు వచ్చి డైట్పై దృష్టి పెట్టాలి.
హెల్దీ వెయిట్ గెయిన్
కొంతమంది బరువు పెరగడం కోసం ఏవేవో పౌడర్లు, ట్యాబ్లెట్లు వాడుతుంటారు. సైంటిఫిక్గా ఎలాంటి ఆధారం లేని ప్రొడక్ట్స్తో బరువు పెరిగే ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరు బర్గర్, పిజ్జా, నూడుల్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటుంటారు. కానీ వాటివల్ల బరువు పెరగడం మాట పక్కనపెడితే లేనిపోని తలనొప్పులొస్తాయి. వాటివల్ల వచ్చే సైడ్ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. అందువల్ల బరువు పెరగడానికి ఎప్పుడూ హెల్దీ డైట్నే ఫాలో అవ్వాలి. అప్పుడే బరువుతోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఎక్సర్సైజ్లు
జిమ్లు, వర్కవుట్లంటే కేవలం బరువు తగ్గడానికే అనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ బరువు పెరగడానికి కూడా ఎక్సర్సైజ్లున్నాయ్. స్క్వాట్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి వాటివల్ల తేలిగ్గా బరువు పెరగొచ్చు. వీటివల్ల కండరాలు కూడా బలంగా తయారై బాడీ ఫిట్గా ఉంటుంది. అందులో రోజుకి ఒక అరగంటయినా ఈ ఎక్సర్సైజ్లు చేయాలి.
చీజ్
రెండు గ్రాముల చీజ్ లో దాదాపు తొమ్మిది కేలరీల శక్తి ఉంటుంది. పిండిపదార్థాలు, మాంసకృత్తులు కలిపి తీసుకున్నా ఇన్ని కేలరీలు రావు. దీనిలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు పెరగాలనుకునే వాళ్లు రోజువారీ డైట్లో చీజ్ని చేర్చాలి. చీజ్ రుచికి కూడా బాగుంటుంది కాబట్టి రకరకాల వంటకాల్లో వేసుకుని తినొచ్చు. అలాగని చీజ్ని ఎక్కువగా తినకూడదు. కొంచెం తిన్నా కేలరీలు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి తక్కువ మోతాదులో తినాలి. ఇంట్లోనే చీజ్తయారు చేసుకుని తింటే మరీ మంచిది.
అన్నం
బరువు పెరగాలి అనుకునే వాళ్లకి వరి అన్నాన్ని మించిన బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు. ఒక కప్పు (150 గ్రాముల) అన్నంలో దాదాపు 40 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. వీటినుంచి శరీరానికి 190 కేలరీలు అందుతుంది. అందువల్ల అండర్ వెయిట్తో బాధపడే వాళ్లు ప్రతి రోజు మూడు పూటలా అన్నం తినాలి. అలాగే మొక్కజొన్న, గోధుమ, రాగులు, సజ్జలు తదితర ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు తిన్నా బరువు పెరుగుతారు. ఆలుగడ్డ, గెరిసి గడ్డలు తినడం వల్ల కూడా లావు పెరగొచ్చు. రోజుకు ఒక గుప్పెడు వేరుశెనగ పప్పుల్లో దాదాపు 100 నుండి 150 కేలరీల శక్తి అందుతుంది. అందువల్ల బరువు పెరగాలి అనుకునే వాళ్లు వీటిని కూడా డైట్లో చేర్చాలి.
నట్స్
నట్స్లో ఫ్యాట్స్, పిండి పదార్థాలు, కేలరీలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ప్రతి రోజు తీసుకునే ఆహారంలో డ్రైఫ్రూట్స్, నట్స్ ఉండేలా చూసుకోవాలి. ఉదయం, రాత్రి కనీసం తొమ్మిది ఖర్జూరాలు తినాలి. అలాగే పాలు, పెరుగు, పన్నీర్, పప్పుధాన్యాలు, గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు త్వరగా పెరగొచ్చు. అలాగే బ్రేక్ ఫాస్ట్ , లంచ్ తర్వాత రెండు అరటిపండ్లు తింటే శరీరానికి కేలరీలు బాగా అందుతాయి. కానీ పడుకునే ముందు మాత్రం అరటి పండ్లు తినకూడదు.
ఇవి తినాలి
టీనేజ్లో అమ్మాయిల శరీరాల్లో శారీరకంగా, మానసికంగా మార్పులు మొదలవుతాయి. అందువల్ల ఈ వయసులో శరీరానికి తగిన పోషకాలు అందించాలి. టీనేజ్ అమ్మాయిల్లో 30% ఐరన్ లోపం, 20% విటమిన్–ఏ తక్కువగా ఉంటున్నాయని సర్వేలు చెప్తున్నాయి. టీనేజ్లో ఈ పోషకాల లోపం వల్ల శరీరంలోని హార్మోన్లలో హెచ్చుతగ్గులు కూడా చోటుచేసుకుంటున్నాయి.అందువల్ల ఈ వయసు అమ్మాయిలు కాల్షియం, ఐరన్, అయోడిన్ ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. అలాగే ఆడపిల్లలు ఎదిగి గర్భం దాల్చినప్పుడు, పిల్లలకు పాలిచ్చే సమయానికి ఎలాంటి బలహీనతలూ, ఆరోగ్య సమస్యలూ రాకుండా ఉండాలంటే పదేళ్ల వయసు నుంచే మాంసకృత్తులు ఉన్న ఆహారం ఇవ్వాలి. ఈ దశలో పిల్లలకు పోషకాలున్న ఆహారం ఇస్తే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అంటున్నారు డాక్టర్లు. అంతేకాదు ఏం ఏం తినాలో కూడా చెప్తున్నారు.
ఇవి తినాలి
చేపలు, గుడ్లు, పాలు, చీజ్ , కోడి మాసం, మటన్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను బలంగా చేయడంతో పాటు కణాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల వీటిని తరచూ తీసు కుంటూ ఉండాలి.అలాగే కాల్షియం అధికంగా ఉండే క్యాబేజీ, బ్రొకోలి, ఓక్రాలను కూడా డైట్లో చేర్చాలి. వీటితో పాటు ఐరెన్ కోసం మాంసం, పాలకూర తీసుకోవాలి.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి