
నిజాంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసుకోవాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. బుధవారం ఆయన మండల పరిధిలోని నందిగామ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ వుతాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ వేగం పెంచి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని.. ఆ దిశగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అంగన్వాడీ సెంటర్లో పలు రికార్డులను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారంపై అరా తీశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి, ఎంపీవో ప్రవీణ్, ఆర్ఐ ప్రీతి, విలేజ్ సెక్రటరీ అరిఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు బాసట నిలిచేందుకే రైతు భరోసా
మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బాసటగా నిలవాలనే సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం అమలు చేస్తోందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ... మెదక్ జిల్లాలో 2,62,340 రైతుల ఖాతాల్లో రూ.221.15 కోట్లు నేరుగా జమ అయినట్లు పేర్కొన్నారు.