2024లో ముస్లింలు ఎటువైపు? : ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

2024లో ముస్లింలు  ఎటువైపు? : ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

భారత రాజ్యాంగంలో కీలకమైన లౌకికవాదం రాతలకు, మాటలకే పరిమితమవుతోంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాజకీయ పార్టీల వ్యూహాలన్నీ కులం, మతం, ప్రాంతీయ అంశాల చుట్టే తిరుగుతున్నాయి. ఏయే వర్గాలతో ఎన్ని ఓట్లు పడతాయనే ధోరణితోనే రాజకీయ పార్టీలున్నాయి. 2024 ఏప్రిల్‌‌లో జరగబోయే లోక్‌‌సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలు, ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. దేశంలో ప్రధానమైన ముస్లిం ఓటర్లకు సంబంధించి చరిత్రను పరిశీలిస్తే స్వాతంత్య్రానంతరం ఎప్పుడూ లేనివిధంగా ప్రస్తుత రాజకీయాలు సుమారు 14 శాతం ఉన్న ముస్లిం మైనార్టీల చుట్టే తిరుగుతున్నాయి. ఒక రాజకీయ పక్షం ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ  ఓట్లు పొందాలని చూస్తుంటే, మరో పక్షం ఏకపక్షంగా ముస్లిం ఓట్లు ఎలా పొందాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింల పాత్ర ఏమిటి? వారెటువైపు ఉండబోతున్నారు? ముస్లింలపై రాజకీయాలతో ఏ పక్షం అధిక ప్రయోజనాలు పొందబోతున్నారనేది కీలక అంశంగా మారింది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో మరోసారి గెలిచి హ్యాట్రిక్‌‌ సాధిస్తామనే ధీమాతో ఉంది. తొలుత పాజిటివ్‌‌ అంశాలతో ఎన్నికలకు వెళ్తామని చెప్పిన బీజేపీ ఎన్నికలు సమీపించేసరికి అయోధ్యలో రామ మందిరం, ఆర్టికల్‌‌ 370, ట్రిపుల్‌‌ తలాక్‌‌, యూసీసీ వంటి భావోద్వేగ అంశాలను తెరమీదకు తెస్తోంది. 1980 నుంచి పార్టీ ఎజెండాగా ఉన్న అయోధ్య రామ మందిరం, జమ్ము కాశ్మీర్‌‌ 370 ఆర్టికల్‌‌ రద్దు అంశాలు నాలుగు దశాబ్దాల అనంతరం ఒక కొలిక్కి రావడంతో ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని బీజేపీ ఆశిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌‌ నేతృత్వంలో దేశంలోని 28 పార్టీలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడి ప్రధానంగా ముస్లిం ఓట్లు చీలకుండా బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ భావోద్వేగాలు పనిచేయడం లేదని బీజేపీ గుర్తిస్తే, ఆ పార్టీ తురుపుముక్కగా కాంగ్రెస్‌‌ కూటమి ముస్లింలను బుజ్జగిస్తుందనే అంశాన్ని తెరమీదకు తెచ్చే అవకాశాలున్నాయి.

ముస్లిం ఓటర్లలో మార్పు

 దేశంలోని రాజకీయ పార్టీలకు ముస్లింలు ఒక ఓటు బ్యాంక్‌‌గా మారారు. స్వాతంత్య్రానంతరం నాలుగైదు దశాబ్దాలు వీరి ఓటు బ్యాంక్‌‌పై  పెద్దగా చర్చే ఉండేది కాదు. వీరు ఏకపక్షంగా కాంగ్రెస్‌‌ను ఆదరించారు. అయితే, రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ముస్లిం ఓటర్లలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. మండల్‌‌ కమిషన్‌‌ అంశంతో దేశ రాజకీయాలలో పలు ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రాష్ట్రీయ జనతాదళ్‌‌, జనతాదళ్‌‌ యునైటెడ్‌‌, సమాజ్‌‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌‌ పార్టీ వంటి పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ముస్లింలు కాంగ్రెస్‌‌కు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలవైపు చూడడం మొదలుపెట్టారు. ఇందుకు ప్రధాన కారణం దశాబ్దాలుగా కాంగ్రెస్‌‌ వెంటే ఉన్న ఆ పార్టీ తమను ఒక రాజకీయ పావుగా వాడుకుందే తప్ప ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదనే అభిప్రాయం వారిలో ఏర్పడింది. ముస్లింలు కాంగ్రెస్‌‌ను కాదని ప్రాంతీయ పార్టీల వైపు చూస్తుండడంతో వారి ఓట్ల ప్రాముఖ్యతపై దేశంలో చర్చ మొదలైంది. ముస్లింలు ప్రాంతీయ పార్టీల వైపు మళ్లడంతో తీవ్ర నష్టం జరుగుతుందని కాంగ్రెస్‌‌ ఆలస్యంగా గ్రహించింది. 90వ దశకంలో దేశ రాజకీయాల్లో బీజేపీ రాణించడంతో ప్రత్యామ్నాయంగా ముస్లిం ఓట్లపై అన్ని పార్టీల దృష్టి మళ్లింది. బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అని ప్రచారం చేస్తూ వారి ఓట్లతో రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్‌‌ చూస్తుంటే, కాంగ్రెస్‌‌ ముస్లింలకు అధిక ప్రాధాన్యతిస్తుందనే ప్రచారంతో హిందువుల ఓట్లను అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది.

 ప్రాంతీయ పార్టీల ఆకర్షణ

దేశ రాజకీయాల్లో ముస్లిం ఓట్ల పాత్రను పరిశీలిస్తే 1971లో 70 శాతం ముస్లిం ఓట్లను కాంగ్రెస్‌‌ పొందింది. 1971-–1996 మధ్య 67 నుంచి 68 శాతం ముస్లిం ఓట్లను సాధించింది. 1996-–2019 మధ్య కాంగ్రెస్‌‌కు ముస్లింల మద్దుతు తగ్గుతూ వస్తోంది. 1996–-98 మధ్య 40- శాతం ముస్లింల మద్దతు కాంగ్రెస్‌‌కు ఉండగా, 2019లో 33- శాతం మద్దతే లభించింది. కాంగ్రెస్‌‌కు మద్దతుగా ఉన్న ముస్లిం ఓట్ల పునాదులను ప్రాంతీయ పార్టీలు దెబ్బతీశాయి. కాంగ్రెస్‌‌కు ప్రత్యామ్నాయంగా టీఎంసీ, ఆప్‌‌, ఆర్జేడీ, జేడీయూ, బీఆర్‌‌ఎస్‌‌, ఎస్పీ, బీఎస్పీ, ఏఐయూడీఎఫ్‌‌ పార్టీలు ముస్లిం ఓట్లను పెద్ద ఎత్తున పొందుతున్నాయి. 1960 నుంచి 1990 వరకు ముస్లింలు కాంగ్రెస్‌‌కు ఏకపక్షంగా మద్దతివ్వడంతో ఆ పార్టీ పాలనలో ముస్లింలకు ఏదో లబ్ధి జరిగిపోయిందనే ప్రచారం దేశవ్యాప్తంగా జరిగినా, ముస్లింల స్థితిగతులపై సచార్‌‌ కమిటీ ఇచ్చిన నివేదికలోని డేటాను పరిశీలిస్తే ముస్లింలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడే ఉన్నారని తేలడం గమనార్హం.దేశ రాజకీయాల్లో ముస్లింల పాత్రపై ఆ సామాజికవర్గంలోని విద్యావంతులలో చర్చ మొదలైంది. ఏకపక్షంగా ఒకే పార్టీ పక్షాన ఉండే బదులు ముస్లింలు నిర్ణయాత్మకంగా ఉన్న నియోజకవర్గాల్లో తమ సామాజిక అభ్యర్థిని ఎందుకు గెలిపించుకోలేమనే భావన వారిలో నెలకొంది.

ముస్లింలకు సమప్రాధాన్యం ఇవ్వాలి

ఉత్తరప్రదేశ్‌‌ వంటి రాష్ట్రాల్లో హిందువులు ఏకపక్షంగా బీజేపీకే ఓటు వేస్తుండడంతో ముస్లింలు తమకు మద్దతుగా ఉండే పార్టీల వైపే చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి ప్రత్యామ్నాయంగా సమాజ్‌‌వాదీ పార్టీకి ముస్లింలు మద్దతిస్తూ 60 శాతంకు పైగా ఓటేశారు. కాంగ్రెస్‌‌కు కేవలం 10–-12 శాతం ముస్లిం ఓట్లు లభించాయి. బీఎస్పీకి 18-–20 శాతం ముస్లింలు ఓట్లు వేశారు. 2019తో  పోలిస్తే 2024 ఎన్నికల్లో ముస్లింలు మరింత ఏకపక్షంగా యూపీలో ఎస్పీ (ఇండియా కూటమి)కి మద్దతిచ్చే అవకాశాలున్నాయి.  ఇటీవల మోదీ ‘పస్మాండా ముస్లిం’ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ‘పస్మాండా’ అంటే పర్షియన్‌‌ భాషలో వెనుకబడిన అని అర్థం. ముస్లింలంటేనే వ్యతిరేక భావనతో ఉండే బీజేపీ లేవనెత్తిన ‘పస్మాండా ముస్లిం’ నినాదాన్ని ముస్లింలు నమ్మే అవకాశాలు తక్కువే. ఇందుకు ప్రధాన కారణం యూపీ, గుజరాత్‌‌తో పాటు చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌‌ ఎన్నికలలో బీజేపీ ముస్లింలకు టికెట్లే ఇవ్వలేదు.  . దేశంలో ముస్లింలను ఒక ఓటు బ్యాంకుగా కాకుండా అన్ని రంగాల్లో వారికి సమంగా ప్రాధాన్యతివ్వాలి. వారి వెనుకబాటును రూపుమాపేలా చర్యలు తీసుకునే పార్టీకి 2024 లోక్‌‌సభ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం ఏకపక్షంగా మద్దతివ్వడం ఖాయం.

కాంగ్రెస్ హిందూత్వ ఎజెండా

దేశంలో ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌‌ ముస్లింలను రాజకీయ ఓటుబ్యాంక్​గా వాడుకుంటున్నాయి. తామే హిందూ సమాజ పరిరక్షకులమని చెప్పుకుంటూ బీజేపీ ముస్లింలు వ్యతిరేకించే సున్నితమైన అంశాలతో లబ్ధి పొందుతోంది. కాంగ్రెస్‌‌ కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. ముస్లింలపై కాంగ్రెస్‌‌ పలు రాష్ట్రాల్లో వేర్వేరు ఎజెండాలను రూపొందించుకుంని రాజకీయాలు చేస్తోంది. గతంలో పార్టీ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీ కాంగ్రెస్‌‌ ముస్లింలకు, క్రిస్టియన్లకు అధిక ప్రాధాన్యతిస్తుందనే భావన దేశ ప్రజల్లో ఏర్పడిందని, ఈ భావనను తొలగించడానికి సాఫ్ట్‌‌ హిందూత్వను అనుసరించాలని నివేదిక ఇచ్చింది.  ఈ నివేదికకు అనుగుణంగానే రాహుల్‌‌గాంధీ గుజరాత్‌‌, మధ్యప్రదేశ్‌‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు ఆలయాలను దర్శించారు. నేనే నిజమైన హిందువు అని ప్రకటించుకోవడానికి పోటీ పడ్డారు. మధ్యప్రదేశ్‌‌, రాజస్థాన్‌‌, ఛత్తీస్‌‌గఢ్‌‌లో ముస్లింలు తొమ్మిది శాతంలోపే ఉండడంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాఫ్ట్‌‌ హిందూత్వ ఎజెండాను కాంగ్రెస్​ చేపట్టింది. అదే సమయంలో 14 శాతం ముస్లింలున్న తెలంగాణలో మాత్రం ముస్లింల కోసం ప్రత్యేక డిక్లరేషన్‌‌ ప్రకటించింది.

ముస్లింల చుట్టే రాజకీయాలు

ముస్లింలు అధికంగా ఉండే అస్సాం, పశ్చిమబెంగాల్‌‌, బీహార్‌‌, ఉత్తరప్రదేశ్‌‌ రాష్ట్రాల్లో రాజకీయాలు ముస్లింల చుట్టే తిరుగుతాయి. ఈ రాష్ట్రాల్లో ముస్లింలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఓట్లు పోలరైజ్‌‌ అయ్యేలా చేసి రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయి. ఈ కారణంగానే అస్సాం, ఉత్తరప్రదేశ్‌‌ రాష్ట్రాల్లో బీజేపీ, పశ్చిమబెంగాల్‌‌, బీహార్‌‌ రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యర్థులైన తృణముల్‌‌ కాంగ్రెస్‌‌, జేడీయూ కూటమి లబ్ది పొందాయి. బీజేపీతో కాంగ్రెస్‌‌ ముఖాముఖిగా తలపడే మధ్యప్రదేశ్‌‌, రాజస్థాన్‌‌, చత్తీస్‌‌గఢ్‌‌, హర్యాణా, ఉత్తరాఖండ్‌‌, హిమాచల్‌‌ప్రదేశ్‌‌, గుజరాత్‌‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌కు 75 నుంచి 77శాతం ముస్లింల మద్దతు లభిస్తోంది. ఇక్కడ బీజేపీకి 18 నుంచి20 శాతం ముస్లిం ఓట్లు వస్తున్నాయి. బీజేపీకి సుమారుగా 20 శాతం ముస్లిం ఓట్లు రావడానికి ప్రధాన కారణం అభ్యర్థులు, అభివృద్ధిని బట్టి ఉంటుంది. బీజేపీని సైద్ధాంతికంగా వ్యతిరేకించే ముస్లింలు ట్రిపుల్‌‌ తలాక్‌‌ అంశంతో యూపీ ఎన్నికల్లో ఆ పార్టీ వైపు మళ్లారా  అనే చర్చ జరిగింది. కానీ, యూపీతో సహా దేశంలో ముస్లిం ఓటు బ్యాంకు బీజేపీకి ఎన్నడూ అనుకూలంగా లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 1996 నుంచి 2019 వరకు జరిగిన లోక్‌‌సభ ఎన్నికలను పరిశీలిస్తే  ఎనిమిది శాతానికి మించకుండా 5 నుండి 7 శాతం ముస్లిం ఓట్లే బీజేపీకి పడ్డాయి.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ, రీసెర్చర్‌‌, పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ.