ఇండియాలోని ఎంట్రప్రెనూర్ల మీద ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్లు, బ్యాంకర్లు పెడుతున్న ఒత్తిడే కెఫే కాఫీ డే (సీసీడీ) ఫౌండర్ వీ జీ సిద్ధార్థ ఆత్మహత్యకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇండియా స్టార్బక్స్గా పేరొందిన కెఫే కాఫీ డే లో మొత్తం 50 వేల మంది ఉద్యోగులున్నారు. కొంతమంది ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్లు, కాఫీ డే ఎంటర్ప్రైజస్ బోర్డులోని కొంత మంది ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్రపై ఇప్పడు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దృష్టి పెడుతోంది. షేర్ల బైబ్యాక్కు ప్రైవేట్ ఈక్విటీ పార్టనర్లు తెస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్లు అదృశ్యం కావడానికి కొన్ని రోజుల ముందు బోర్డులోని డైరెక్టర్లకు, ఉద్యోగులకు రాసిన లెటర్లో సిద్ధార్థ పేర్కొన్నారు. ఆ ఒత్తిడిని చాలా కాలంగా భరిస్తున్నానని, ఇక భరించలేనని వ్యాఖ్యానించారు. ఆరు నెలల కిందట పాక్షికంగా పూర్తైన ట్రాన్సాక్షన్ను ఇప్పుడు పూర్తి చేయాలని ఆ ప్రైవేట్ ఈక్విటీ పార్ట్నర్ పట్టు పడుతోందని, అప్పట్లోనే ఒక స్నేహితుడి నుంచి భారీగా అప్పు తెచ్చి, నానా తంటాలు పడి దానిని పూర్తి చేయగలిగానని సిద్ధార్థ స్పష్టం చేశారు. ఇతర అప్పుల వాళ్లు తక్కువేమీ కాదని, వారి ఒత్తిడి కూడా ఇటీవల పెరిగిందని సిద్ధార్థ పేర్కొన్నారు. అంతేకాదు, రూ. వెయ్యి కోట్ల దాకా పర్సనల్ లోన్ను కూడా సిద్ధార్థ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ పీఈపై కేసు బుక్ చేయొచ్చా!
సిద్ధార్థను ఆత్మహత్యకు ప్రేరేపించిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, లెండర్లపై కేసు బుక్ చేయడం కుదరదా అని ఆవేదనతో ప్రశ్నించారు కెఫే కాఫీ డేలోని పేరు చెప్పడానికి ఇష్టపడని, ఉన్నతోద్యోగి ఒకరు. 25 శాతం రిటర్న్స్ డిమాండ్ చేయడం ద్వారా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ కాఫీ కింగ్ సిద్ధార్థ ప్రాణం బలిగొందని వ్యాఖ్యానించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి 8 శాతం వడ్డీకి కేకేఆర్ అప్పు తెచ్చుకుందన్నారు. సిద్ధార్థ మరణానికి బాధ్యత ఎవరిది, కేకేఆర్ దా లేక ఎస్బీఐ దా ? అని ప్రశ్నించారు. సిద్ధార్థ రాసినట్లుగా చెబుతున్న లెటర్లోని అంశాల మీద సీసీడీ మేనేజ్మెంట్ ప్రస్తుతం పెదవి విప్పడం లేదు. బిజినెస్ యధావిధిగా సాగేలా ముందు చర్యలు తీసుకుంటామని మాత్రమే స్పష్టం చేస్తోంది. కాఫీ డే లో నాలుగు విదేశీ కార్పొరేట్ బాడీస్కు 22.35 శాతం వాటా ఉంది.
ఎన్ఎల్ఎస్ మారిషస్ ఎల్ఎల్సీకి 10.61 శాతం, కేకేఆర్ మారిషస్ పీఈ ఇన్వెస్ట్మెంట్స్ 6.07 శాతం వాటా (1.28 కోట్ల షేర్లు) రెండో అతి పెద్ద విదేశీ ఇన్వెస్టర్గా ఉంది. అప్పులు ఇచ్చిన వాళ్లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థల నుంచి ఒత్తిడి రూపంలో మెడపై కత్తులు వేలాడుతుండటంతో ఇండియాలోని ఎంట్రప్రెనూర్లకు మరిన్ని గడ్డురోజులు రాబోతున్నాయనే చెప్పాలి. ఇండియాలోని బిజినెస్లపై భవిష్యత్లో ఏ విధమైన ప్రభావం చూపిస్తాయో, ఇంకా ఏ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే. కెఫే కాఫీ డే కంపెనీ సిద్ధార్థని ఆత్మహత్యకు ప్రేరేపించేలా వేధించిన ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ ఎవరనేదే ఇప్పుడు అందరి మెదళ్లనూ తొలుస్తున్న బిలియన్ డాలర్ల ప్రశ్న.
అప్పులు, వడ్డీలే వెన్ను విరుస్తున్నాయ్..
ఇండియాలోని బ్యాంకుల నుంచి 8–9 శాతం వడ్డీ రేటుతో అప్పులు తీసుకుని, అదే డబ్బుని ఇండియాలోని బిజినెస్లకు 22–25 శాతం వడ్డీతో అప్పులుగా ఇస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బిజినెస్లు స్థిరంగా ఎదగడానికి ఈ అధిక వడ్డీ రేట్లే పెద్ద అవరోధంగా మారాయని వ్యాఖ్యానిస్తున్నాయి. లాభసాటిగా ఉంటూ, లెండర్ల అప్పులు తీర్చడం వాటికి కష్టతరంగా మారిందని పేర్కొంటున్నాయి. వ్యాపారం చేయడానికి స్నేహపూర్వక వాతావరణం లేకపోవడంతోపాటు, ఈ అధిక వడ్డీ రేట్లు బిజినెస్ల కొంపముంచుతున్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. దూకుడు ప్రదర్శించే ప్రైవేట్ ఈక్విటీ సంస్థల ఏకైక లక్ష్యం అధిక ప్రాఫిట్ మార్జిన్లు. అందుకే కుదుర్చుకునే ఒప్పందాల విషయంలోనూ అవి అంతే కఠినత్వాన్ని చూపించి, ఎంట్రప్రెనూర్ల మీద తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తాయి.