మెహిదీపట్నం, వెలుగు: ప్రియుడితో కలిసి భర్తను భార్య కత్తితో పొడిచి చంపింది. అఫ్జల్ సాగర్ కు చెందిన రోషన్ (29) స్థానికంగా శీతల్ హోటల్ లో వర్కర్. రోజు మద్యం తాగి వస్తుండగా దంపతుల మధ్య గొడవ జరుగుతుండేది. శనివారం మధ్యాహ్నం రోషన్ ఇంటికి వచ్చేసరికి అతని భార్య లత ప్రియుడు యువరాజ్ తో ఉంది. దీంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో భర్తను లత కత్తితో పొడవగా చనిపోయాడు. వెంటనే ప్రియుడితో కలిసి పరారైంది. స్థానికులు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి డెడ్బాడీని ఉస్మానియాకు తరలించి కేసుఫైల్ చేశారు.
గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో మరొకరు
మెహిదీపట్నం పరిధి ఎన్ఎండీసీ ఏరియాలో ఖాజీ నిజాముద్దీన్ (48)కి ట్రావెల్ పాయింట్ ఉంది. శనివారం రాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నిజాముద్దీన్ తో గొడవపడి కత్తులతో దాడి చేశారు. అతడి మెడకు తీవ్రగాయమవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఫస్ట్ లాన్సర్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు అనుమానిస్తూ కేసు నమోదు చేశామని హుమయూన్నగర్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు.