- ఉ. 9 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో లైవ్
సిడ్నీ: తొలి వన్డేలో బ్యాటర్లు ఫెయిల్. రెండో మ్యాచ్లో బౌలర్లు చేతులెత్తేశారు. ఇప్పటికే సిరీస్ పోయింది. మరోసారి ఓడితే ఆస్ట్రేలియా చేతిలో తొలిసారి వైట్వాష్ ఎదురవుతుంది. దాన్ని తప్పించుకోవాలన్నా.. వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ ప్రయాణం ఘోర పరాభవంతో మొదలవకూడదన్నా.. శనివారం (అక్టోబర్ 25) సిడ్నీలో జరిగే ఆఖరి, మూడో వన్డేలో టీమిండియా నెగ్గాల్సిందే.
ఈ మ్యాచ్ అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టానికి వేదిక కానుంది. ఇండియా క్రికెట్ లెజెండ్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా గడ్డపై ఇదే ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, గౌతమ్ గంభీర్ కోచింగ్లోని ఇండియా కనీసం ఈ పోరులో అయినా గెలిచి 0–-3 వైట్వాష్ పరాభవం తప్పించుకొని, పరువైనా దక్కించుకోవాలని చూస్తోంది.
కాంబినేషన్ సెట్ అయ్యేనా!
తొలి మ్యాచ్లో ఫెయిలైన రోహిత్ గత పోరులో ఫిఫ్టీతో ఆకట్టుకున్నా.. వరుసగా రెండు డకౌట్లు అయిన విరాట్ కోహ్లీపై ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఉంది. ఇన్నేండ్ల తన అద్భుత కెరీర్లో తొలిసారిగా కోహ్లీ వరుసగా రెండు వన్డేల్లో సున్నాచుట్టాడు. ఇది అతని శకం ముగియడానికి సంకేతమని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇండియా లెజెండ్స్ను చూడటానికి స్టేడియానికి పోటెత్తుతున్న ఫ్యాన్స్ కోహ్లీ బ్యాట్ నుంచి ట్రేడ్మార్క్ కవర్ డ్రైవ్లు, ఆన్-డ్రైవ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ పోరులో అయినా విరాట్ బ్యాట్ ఝుళిపిస్తాడేమో చూడాలి. మరోవైపు, కెప్టెన్ శుభ్మన్ గిల్ (10, 9 రన్స్) కూడా ఫెయిలవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, టీమ్ను వేధిస్తున్న అసలు సమస్య బౌలింగ్ యూనిట్, టీమ్ కాంబినేషన్.
హార్దిక్ పాండ్యా లేకపోవడంతో అరకొర ఆల్రౌండర్లపై ఆధారపడటం..పెర్త్, అడిలైడ్ ఓవల్లో అక్షర్ పటేల్, సుందర్ను ఆడించి మ్యాచ్ విన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. యంగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి బౌలింగ్లో ఇంటర్నేషనల్ లెవెల్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టేంత స్పీడ్ లేదు. హర్షిత్ రాణా సెకండ్, థర్డ్ స్పెల్స్లో పేస్ కోల్పోవడం అతనింకా ఇంటర్నేషనల్ చాలెంజ్కు సిద్ధంగా లేడని చెబుతోంది.
ఈ నేపథ్యంలో ప్రసిద్ధ్ కృష్ణ వంటి పేసర్ను తుది జట్టులోకి తేవడం అత్యవసరం. ఈ సిరీస్లో ఇండియాకు ఏకైక సానుకూలాంశం అక్షర్ పటేల్. అతను బౌలింగ్లో నిలకడగా రాణిస్తూ, బ్యాటింగ్లోనూ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. తను ఇదే ఫామ్ కొనసాగిస్తే వన్డేల్లో రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేయగలడు. ఏదేమైనా సరైన కాంబినేషన్తో బరిలోకి దిగి సమష్టిగా సత్తా చాటితేనే ఇండియా వైట్వాష్ తప్పించుకొని పరువు కాపాడుకోగలదు.
హ్యాట్రిక్పై ఆసీస్ కన్ను
స్టీవ్ స్మిత్, మాక్స్వెల్ రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా జట్టు పుంజుకుంది. మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, కూపర్ కనొలీ వంటి యంగ్స్టర్స్ ఒత్తిడిలోనూ రాణిస్తూ తర్వాతి రాబోయే వరల్డ్ కప్ కోసం సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. వీళ్ల జోరుతో వరుసగా రెండు వన్డేల్లో తిరుగులేని విజయాలు సాధించిన ఆసీస్ అదే ఊపులో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. వన్డే సిరీస్ల్లో ఆసీస్ ఒక్కసారి కూడా ఇండియాపై క్లీన్స్వీప్ విక్టరీ సాధించలేదు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టాలని కంగారూ టీమ్ పట్టుదలగా ఉంది. ఇప్పటికే సిరీస్ దక్కిన నేపథ్యంలో ఆసీస్ మరింత స్వేచ్ఛగా ఆడనుంది. స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్కు రెస్ట్ ఇచ్చి జాక్ ఎడ్వర్డ్స్, నేథన్ ఎలీస్ను బరిలోకి దింపొచ్చు.
పిచ్/వాతావరణం
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. అయితే స్పిన్నర్లకు కూడా కొంత సహకారం లభించవచ్చు. ఈ గ్రౌండ్లో ఇండియాపై ఆస్ట్రేలియాకు 16-–2 (ఒక మ్యాచ్ రద్దు)తో అద్భుత రికార్డు ఉంది. శనివారం వర్ష సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లీ, శ్రేయస్, అక్షర్, రాహుల్ (కీపర్), సుందర్/కుల్దీప్, నితీష్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ/హర్షిత్ , అర్ష్దీప్, సిరాజ్.
ఆస్ట్రేలియా : మిచెల్ మార్ష్ (కెప్టెన్), హెడ్, మాథ్యూ షార్ట్, రెన్షా, క్యారీ (కీపర్), కనొలీ, ఓవెన్, బార్ట్లెట్, స్టార్క్/జాక్ ఎడ్వర్డ్స్, జంపా,
ఎలీస్/హేజిల్వుడ్.
ఆసీస్లో రోకో ఆఖరి ఆట?
రాబోయే రెండేండ్లలో ఆస్ట్రేలియాలో ఇండియా వన్డే సిరీస్లు ఆడే ప్లాన్స్ లేవు. దీంతో ఇప్పటికే టీ20, టెస్టులకు దూరమైన రోహిత్, కోహ్లీ (రో-కో) మళ్లీ ఆసీస్ గడ్డపై ఇండియా బ్లూ జెర్సీలో వన్డే ఆడటం అసాధ్యమనే చెప్పాలి. 2007-–08లో రోహిత్ , 2011–-12లో కోహ్లీ ఇక్కడ ఆట మొదలెట్టారు. ఇన్నేండ్ల ప్రయాణంలో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లు ఆడి అభిమానులను అలరించారు. ఈసారి ఏం చేస్తారో చూడాలి.
