ముంబై: టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ (ఇండియా) లిమిటెడ్, ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ క్యాపిటల్ ఐపీఓలకు సెబీ నుంచి అనుమతులు వచ్చాయి. 2022 డిసెంబర్ –2023 మార్చి మధ్య సెబీకి ఇవి డాక్యుమెంట్లను అందజేశాయి. టాటా టెక్నాలజీస్ ఐపీఓలో ఫ్రెష్ ఇష్యూ ఉండదు. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా షేర్లను అమ్ముతారు. ఓఎఫ్ఎస్ కింద, టాటా టెక్నాలజీస్ పేరెంట్ కంపెనీ టాటా మోటార్స్ 8.11 కోట్ల షేర్లను లేదా కంపెనీలో 20 శాతం వాటాను ఆఫ్లోడ్ చేస్తుంది. ఇతర వాటాదారులలో, ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ 97.16 లక్షల షేర్లను (2.40 శాతం) విక్రయించనుంది. టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 48.58 లక్షల ఈక్విటీ షేర్లను (1.20 శాతం) ఆఫ్లోడ్ చేస్తుంది. గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఐపీఓ కూడా ఫ్రెష్ఇష్యూ, ఓఎఫ్ఎస్ విధానంలో ఉంటుంది. ప్రమోటర్లు, వాటాదారులు రూ. 357 కోట్ల విలువైన షేర్లను అమ్మతారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 1.2 కోట్ల షేర్లను జారీ చేస్తారు. ఫలితంగా దీనికి రూ.500 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది.
ఈ ఆదాయాన్ని సిల్వాస్సా ప్లాంట్లో ఆటోమోటివ్ ఆయిల్ సామర్థ్యం విస్తరణకు, అవసరమైన పరికరాలు కొనుగోలుకు, అప్పుల చెల్లింపునకు వాడతారు. తలోజా ప్లాంట్లో పెట్రోలియం జెల్లీ దానితో పాటు కాస్మొటిక్ ఉత్పత్తుల విభాగాన్ని విస్తరించడానికి, ప్లాంట్లో బ్లెండింగ్ ట్యాంకులను ఏర్పాటు చేయడానికీ కొంత డబ్బును వినియోగిస్తారు. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీఓ ద్వారా రూ. 1,200 కోట్లను సమీకరించనుంది. ఇందులో రూ. 750 కోట్ల విలువైన ఫ్రెష్ ఇష్యూ, రూ. 450 కోట్ల విలువైన ఓఎఫ్ఎస్ ఉంటాయి. ఈ డబ్బుతో మూలధనాన్ని పెంచుకుంటుంది. ఈ మూడు కంపెనీల షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి