- నగలపై ట్యాక్స్ రద్దుతో ఎంతో మేలు
- ఎగుమతులు భారీగా పెరుగుతాయ్
- కామర్స్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రమణియం
న్యూఢిల్లీ: ఇండియా నుంచి యూఏఈకు వెళ్లే నగల ఎగుమతులపై సుంకం వసూలు చేయబోమని, దీనివల్ల ఇండియా జ్యూయలరీ సెక్టార్కు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర కామర్స్ సెక్రెటరీ బీవీఆర్ సుబ్రమణియం శనివారం తెలిపారు. ఏడాదికి దాదాపు 200 టన్నుల మేర ఎగుమతులకు సుంకం మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో మనదేశం యూఏఈ నుంచి 70 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఎగుమతి సుంకం తగ్గించడం వల్ల భారతీయ నగల వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. యూఏఈ నుంచి ఇండియాకు వచ్చే గోల్డ్బార్స్పై వసూలు చేస్తున్న సుంకాన్ని ఒకశాతం తగ్గిస్తామని సుబ్రమణియం చెప్పారు. ఫలితంగా అక్కడి నుంచి కొనే గోల్డ్ బార్ల ధర తగ్గుతుందన్నారు. ఇప్పటి వరకు యూఏఈకు పంపే ఇండియా నగలపై ఐదు శాతం డ్యూటీ ఉండేదని, ఇప్పుడు ఇది సున్నాకు చేరిందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి కొత్త టారిఫ్ అమలవుతుందని చెప్పారు. రాగి, పాలిథీన్, పాలిప్రోపలీన్ వంటి వాటికీ సుంకం మినహాయింపు ఉంటుంది. డెయిరీ , పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, టీ, కాఫీ, చక్కెర, పొగాకు, పెట్రోలియం వ్యాక్స్, కోక్, రంగులు, సబ్బులు, సహజ రబ్బరు, టైర్లు, ఫుట్వేర్, ప్రాసెస్ చేసిన మార్బుల్స్, బొమ్మల వంటి కొన్ని ప్రొడక్టులకు రాయితీలు ఉండవు.