హనుమకొండ, వెలుగు: ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఎవరికీ కేటాయించకుండా ప్రభుత్వం ఖాళీగా పెట్టడంతో.. కొందరు దందాలకు తెరలేపుతున్నారు. ఆ ఇండ్లు ఇప్పిస్తానంటూ ఆరుగురి నుంచి రూ.14 లక్షలు వసూలు చేసిన బాసాని రమేశ్ అనే జీహెచ్ఎంసీ ఉద్యోగిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను వరంగల్ సీపీ తరుణ్ జోషి ఆదివారం వెల్లడించారు. హనుమకొండలోని నక్కలగుట్టలో ఉంటున్న రమేశ్.. జీహెచ్ఎంసీలో నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. హనుమకొండ బాలసముద్రంలో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తానంటూ తనకు పరిచయమున్నవారికి చెప్పాడు. న్యూశాయంపేటకు చెందిన బుర్రా సుధాకర్కు 3 ఇండ్లు ఇప్పిస్తానని రూ.3 లక్షలు వసూలు చేశాడు. బరుపాటి శంకర్ అనే వ్యక్తి వద్ద రూ.2 లక్షలు తీసుకున్నాడు. చంద్రకళ అనే మహిళకు రెండు ఇండ్లిప్పిస్తానని రూ.5 లక్షలు వసూలు చేశాడు. జడల సదానందం అనే వ్యక్తి నుంచి రూ. 2లక్షలు, తాటిపాముల సింధూజ నుంచి రూ.లక్ష, నీలిగొండ శరత్ అనే వ్యక్తి దగ్గరి నుంచి రూ. లక్ష వసూలు చేశాడు.
తప్పించుకుని తిరిగిండు
డబ్బులిచ్చి నెలలు గడిచినా ఇండ్లు కేటాయించకపోవడంతో బాధితులు.. బాసాని రమేశ్ను నిలదీశారు. దీంతో శంకర్కు రూ.70 వేలు, చంద్రకళకు రూ.2 లక్షలను తిరిగిచ్చేశాడు. మిగిలిన సొమ్ములో రూ.8.30 లక్షలు సొంతానికి వాడుకున్నాడు. డబ్బు తిరిగిచ్చేయాలని బాధితులు నిలదీయడంతో వాళ్ల నుంచి తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం నక్కలగుట్ట బస్టాప్ వద్ద రమేశ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.3 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, గతంలో హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేసినప్పుడు హౌసింగ్ బోర్డు నిధులను దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలపై మరిపెడ పోలీస్ స్టేషన్లోనూ రమేశ్పై కేసు నమోదైనట్టు సీపీ తరుణ్ జోషి చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్ల అర్హుల జాబితాను రెవెన్యూ అధికారులు రెడీ చేస్తారని, బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని
జనానికి సూచించారు.