మహబూబాబాద్ జిల్లాలో ఘటన
మహబూబాబాద్, వెలుగు: అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు గుగులోతు ఈర్యానాయక్ (60) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లి శివారులోని కిష్టాపురం తండాలో జరిగింది. ఈర్యానాయక్ తన గ్రామంలో రెండున్నర ఎకరాలను కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. తెగులు సోకడంతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. పురుగుల మందు కొట్టిన లాభం లేకుండా పోయింది. దీంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు దాదాపు రూ.2 లక్షలు అయ్యాయి. వీటిని ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందిన ఈర్యా నాయక్ పొలంలో గురువారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు హస్పిటల్కు తరలించగా, ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం అర్ధరాత్రి చనిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు.