
- కొత్తగూడెం ఏరియాలో మహిళను అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఆఫీసర్లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన కేసులో ఏసీబీ ఆఫీసర్లు ఓ మహిళను అరెస్ట్ చేశారు. సింగరేణిలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కేసులో రాజేశ్వర్రావు అనే కార్మికుడిని అరెస్ట్ చేసిన ఆఫీసర్లు తాజాగా.. ఇదే కేసుతో సంబంధం ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ప్రాంతానికి చెందిన కె. చైతన్య తల్లి సింగరేణిలో కార్మికురాలిగా పనిచేస్తోంది.
చైతన్య తనకు సింగరేణిలో పైరవీలు చేసే వ్యక్తితో పరిచయం ఉందని, మెడికల్ బోర్డులో అన్ఫిట్ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని, ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయిస్తానంటూ పలువురు కార్మికుల వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ ఆఫీసర్లు గుర్తించారు. రాజేశ్వర్రావుతో కలిసి చైతన్య పైరవీలు చేస్తూ ఆర్థిక లావాదేవీలు నడిపినట్లు తెలుసుకున్నారు. దీంతో ఏసీబీ ఆఫీసర్లు గురువారం ఉదయం రుద్రంపూర్ ఏరియాలోని చైతన్య ఇంటికి వచ్చారు. తాము ఏసీబీ అధికారులమంటూ చెప్పి ఇంట్లో తనిఖీలు చేశారు. అనంతరం చైతన్యతో పాటు ఆమె తల్లిని కూడా తమతో తీసుకెళ్లారు.