
రంగారెడ్డి జిల్లా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఓ ఆకతాయి వేధిపులు భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ గూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యూటీషియన్ గా పనిచేస్తున్న లీజ అనే మహిళను అష్రాఫ్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులకు తెలుపగా.. అష్రాఫ్ను లీజ కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. అయినా అష్రాఫ్ వేధింపులు ఆగకపోవడంతో మనస్తాపానికి గురైన లీజ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఫోన్లో 35 మిస్డ్ కాల్స్ ఉన్నాయని , దీనిని బట్టి.. అష్రాఫ్ ఏ విధంగా వేధింపులకు పాల్పడుతున్నాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అష్రాఫ్కు కొంతమంది బడా నాయకుల అండదండలు ఉన్నాయని, అందువల్లనే మైలార్ దేవ్ పల్లి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లీజ కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.