ఇద్దరు పిల్లల్ని అనాథలుగా మార్చిన వివాహేతర బంధం!

ఇద్దరు పిల్లల్ని అనాథలుగా మార్చిన వివాహేతర బంధం!
  • కొన్నాళ్ల క్రితం భర్త నుంచి వేరపడి.. పిల్లలతో మహిళ జీవనం
  • ఓ వ్యక్తితో పరిచయం పెరిగి వివాహేతర సంబంధం
  • ఆమె ఇంట్లోనే హత్య చేసి.. తలుపుకు తాళం వేసి పరార్

వివాహేతర బంధం ఒక మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. ఇద్దరు పిల్లల్ని తల్లి, తండ్రి లేని అనాథలుగా మార్చేసింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రాజేంద్రనగర్ మండలంలోని అత్తాపూర్ వద్ద గల రాంబాగ్ కాలనీలో జ్యోతి అనే మహిళ, తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. కొన్నాళ్ల క్రితమే తన భర్త నుంచి వేరు పడిందామె. పనులు చేసుకుంటూ వచ్చిన దానితో ఇద్దరు పిల్లలను పోషిస్తోంది.

కానీ, కొద్ది రోజుల క్రితం కుమార్ అనే వ్యక్తితో జ్యోతికి పరిచయమైంది. వారి మధ్య చనువు పెరిగి.. అదికాస్తా వివాహేతర బంధానికి దారితీసింది. అయితే మూడు రోజులుగా ఆమె కనిపించకుండా పోయింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఎక్కడికో వెళ్లిందని పొరుగింటి వాళ్లు పిల్లలను దగ్గరకు తీశారు. ఈ మూడు రోజులు అక్కడే ఉంటున్నారు. అయితే ఇవాళ ఉదయం జ్యోతి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చూశారు. లోపల జ్యోతి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. తల్లి చలనం లేకుండా పడి ఉండడం చూసి పిల్లలిద్దరూ అమ్మా.. అంటూ విలపించారు. వారిని స్థానికులు ఓదార్చి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి పంపారు. ఇరుగు పొరుగు వారి నుంచి వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధం కారణంగానే ఆమె హత్య జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. చంపేసి ఇంటికి తాళం పెట్టి వెళ్లిపోయారని చెప్పారు. అయితే ఆమెను చంపింది ఎవరన్న దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.