
- 5 జట్లకు 30 కంపెనీలు పోటీ
- 6 మెన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆసక్తి
న్యూఢిల్లీ: విమెన్స్ ఐపీఎల్ (డబ్ల్యూఐపీఎల్) వేలం ద్వారా దాదాపు రూ. 4 వేల కోట్లు రాబట్టేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఈ మేరకు ఐదు టీమ్స్ కోసం బుధవారం ఆక్షన్ జరగనుంది. మెన్స్ ఐపీఎల్లోని ఆరు ఫ్రాంచైజీలతో పాటు బడా కంపెనీలు రంగంలోకి దిగడంతో.. ఒక్కో జట్టు రూ. 500 నుంచి 600 కోట్ల మధ్య అమ్ముడయ్యే చాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘డబ్ల్యూఐపీఎల్కు కూడా భారీ స్పందన ఉంటుంది. ఇప్పటికే మెన్స్ టీమ్స్ను కొనుగోలు చేసిన పలు ఫ్రాంచైజీలు బరిలో ఉన్నాయి. దీంతో కొన్ని విమెన్స్ టీమ్స్కు రూ. 500 కోట్ల వరకు బిడ్స్ రావొచ్చు. మరికొన్నింటికి రూ. 800 కోట్ల వరకు వెళ్లొచ్చు. ఓవరాల్గా రూ. 4 వేల కోట్ల వరకు రావొచ్చు’ అని గతంలో మెన్స్ ఐపీఎల్ కోసం పని చేసిన ఓ వ్యక్తి వెల్లడించాడు.
విమెన్స్ టీమ్స్ కోసం ముంబై, కేకేఆర్, సన్రైజర్స్, రాజస్తాన్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ ఇప్పటికే టెక్నికల్ బిడ్లు దాఖలు చేశాయి. సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మాత్రం బిడ్లు వేయలేదు. ఓవరాల్గా విమెన్స్ టీమ్స్ కోసం మొత్తం 30కి పైగా కంపెనీలు బిడ్స్ను కొనుగోలు చేశాయి. అదానీ, టొరెంట్, హల్దీరామ్స్ గ్రూప్స్, కాప్రీ గ్లోబల్, కోటక్ అండ్ ఆదిత్య బిర్లా గ్రూప్ రేసులో ఉన్నాయి. 2021లో మెన్స్ టీమ్స్ కోసం పోటీపడి దక్కించుకోలేకపోయిన కొన్ని బిజినెస్ గ్రూప్స్.. విమెన్స్ టీమ్స్పై ఎక్కువగా దృష్టి పెట్టాయి.