(వెలుగు స్పోర్ట్స్ డెస్క్):మూడుసార్లు సెమీస్ (2009, 2010, 2018), మూడుసార్లు తొలి రౌండ్ (2012, 2014, 2016).. ఒకసారి రన్నరప్ (2020)! టీ20 వరల్డ్కప్లో ఇండియా విమెన్స్ టీమ్ ప్రస్థానం ఇది. ఇప్పుడు ఎనిమిదో ఎడిషన్ కోసం మన టీమ్ రెడీ అయింది. సౌతాఫ్రికా వేదికగా ఈ నెల 10న మెగా టోర్నీ షురూ అవనుంది. మరి, తమకు అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ను టీమిండియా ఈసారైనా ముద్దాడుతుందా? లేక పాత కథనే రిపీట్ చేస్తుందా? అన్నది చూడాలి.
షెఫాలీ, రిచా రాకతో..
యంగ్స్టర్స్ అండర్–19 టీ20 వరల్డ్ కప్ నెగ్గడంతో ఇప్పుడు విమెన్స్ టీమ్లోనూ జోష్ పెరిగింది. ఆ టీమ్లో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మ, రిచా ఘోష్ రాకతో కాన్ఫిడెన్స్ రెట్టింపైంది. ఈ ఇద్దరికి తోడుగా స్మృతి మంధాన ఈ టోర్నీలో అత్యంత కీలకం కానుంది. తన పవర్ హిట్టింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు దడ పుట్టిస్తున్న స్మృతి ఈ టోర్నీలో రాణించాలని పట్టుదలగా ఉంది. దీంతో పాటు వైస్ కెప్టెన్గా కూడా తన ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపెట్టాలని కోరుకుంటోంది. ఓపెనింగ్లో షెఫాలీ, స్మృతి ఇచ్చే ఆరంభంపైనే టీమిండియా విజయాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మిడిలార్డర్లో కెప్టెన్ హర్మన్ప్రీత్, జెమీమా, హర్లీన్, దీప్తి శర్మ తోడైతే ఇండియాకు తిరుగులేదు. బౌలింగ్లోనూ ఇండియా పేస్–స్పిన్ కాంబినేషన్ బలంగానే కనిపిస్తున్నది. కాకపోతే ఫీల్డింగ్లో హర్మన్సేన చాలా మెరుగవ్వాల్సి ఉంది.
ఆ మూడింటితోనే ముప్పు
ఈ టోర్నీలో గ్రూప్–బిలో ఇండియాతో పాటు ఇంగ్లండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ ఉన్నాయి. లీగ్ దశలో ముందంజ వేయాలంటే టీమిండియా.. బలమైన ఇంగ్లండ్కు చెక్ పెట్టాలి. పాక్, విండీస్ నుంచి కూడా పోటీ ఉంటుంది. కాకపోతే ఇంగ్లండ్ను జయిస్తే డైరెక్ట్గా సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకోవచ్చు. అయితే నాకౌట్ దశలో మాత్రం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఇప్పటికే ఐదుసార్లు కప్ నెగ్గిన కంగారూలు ఆరోసారి టైటిల్పై గురి పెట్టారు. రెండుసార్లు రన్నరప్ న్యూజిలాండ్ కూడా రేస్లో కనిపిస్తున్నది. ఇక సౌతాఫ్రికాకు హోమ్ అడ్వాంటేజ్ ఉండనుంది. ఇటీవల ముగిసిన ట్రై సిరీస్ ఫైనల్లో ఆ జట్టు చేతిలో ఇండియా ఓడింది. ఇక, ప్రాక్టీస్ మ్యాచ్లో ఆసీస్ చేతిలో చిత్తయింది. ఓవరాల్గా బలమైన జట్టుతో బరిలోకి దిగుతున్న హర్మన్సేన.. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆడితే ఈసారి కూడా ఫైనల్లో చూడొచ్చు.