
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను తిరిగి పునరుద్ధరించేది లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ జెండా ఉంటేనే జాతీయ జెండాను ఎగరేస్తామని రీసెంట్గా మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలకు రవి శంకర్ ప్రసాద్ దీటుగా బదులిచ్చారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా గతేడాది రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లోని ఇరు హౌజ్ల ఆమోదంతో తొలగించామని ఆయన పేర్కొన్నారు. జాతీయ జెండాను అగౌరవపరిచేలా మెహబూబా చేసిన కామెంట్స్ను ఇతర విపక్ష పార్టీలు ఖండించకపోవడాన్ని తప్పుబట్టారు. దీన్ని వంచనగా, రెండు నాల్కల ధోరణిగా విమర్శించారు. జాతీయ జెండాను అవమానించేలా మెహబూబా ముఫ్తీ కామెంట్స్ చేశారని.. ఆమెపై దేశద్రోహ చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా కోరారు.