కేసీఆర్ పచ్చి అబద్దాల కోరు.. 

కేసీఆర్ పచ్చి అబద్దాల కోరు.. 
  • కేసీఆర్ స్కాములు చేసి సొంత ఆస్తులు పెంచుకుండు
  • సొంత డబ్బుల్తో జనానికి సహాయం చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి
  • దుబ్బాక, హుజూరాబాద్ స్ఫూర్తితో పనిచేయండి
  • బీజేపీ సీనియర్ నేత, మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ వివేక్ వెంకటస్వామి

మునుగోడు (నల్గొండ జిల్లా): ‘‘అమిత్ షా సభ తర్వాత కేసీఆర్ కు గుబులు పుట్టింది.. 2 లక్షల మందికి జనం వచ్చారు.. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని డిసైడ్ అయిపోయారు.. కేసీఆర్ పచ్చి అబద్దాల కోరు.. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది... కరోనా సమయంలో సొంత డబ్బులతో పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సీఎం కేసీఆర్ స్కాములు చేసి సొంత ఆస్తులు పెంచుకుండు’’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కేసీఆర్ హైదరాబాదులో 20వేల ఎకరాలు, కాళేశ్వరం మీద 60వేల కోట్లు.. మిషన్ భగీరథ మీద 30వేల కోట్లు దోచుకున్నాడని ఆయన ఆరోపించారు.

నల్గొండ జిల్లా మునుగోడులో బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్, మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు హాజరయ్యారు. సమావేశానికి కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఉప ఎన్నికలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం చేయాల్సిన గ్రౌండ్ వర్క్ పై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంపీ ఎన్నికలు, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయాల్లో కార్యకర్తలు ఎలా కష్టపడ్డారో మునుగోడులో కూడా అదే స్ఫూర్తితో కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఆనాడు  రాజగోపాల్ రెడ్డితో కలిసి పార్లమెంట్ లో కొట్లాడామని, ఈరోజు కేసీఆర్ అవినీతి పాలనపై కొట్లాడుతున్నామని వివేక్ వెంకటస్వామి వివరించారు. జాతీయ పార్టీ పేరుతో కేసీఆర్ ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మాయమాటలు చెప్పి ఎన్నికల తర్వాత మర్చిపోవడం కేసీఆర్ నైజం అన్నారు.

 ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. మునుగోడు ప్రజల ప్రేమాభిమానాలు రాజగోపాల్ రెడ్డిపై ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న లాక్ డౌన్ సమయంలో రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలకు నిత్యాసవరాలు అందించారని వివరించారు. మునుగోడు ఎన్నికలు ప్రి ఫైనల్ లాంటివన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల తలరాతలు మారతాయని.. మునుగోడులో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన కింద మోడీ ఇండ్లు కావాలని కోరుకుంటున్నారని వివేక్ వెంకటస్వామి వివరించారు. 

నేను పెట్టిన కన్నీళ్లు, బాధ రాజగోపాల్ రెడ్డికి రానివ్వను

బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. నేను పెట్టిన కన్నీళ్లు.. పడిన బాధ రాజగోపాల్ రెడ్డికి రానివ్వనని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా రాజగోపాల్ రెడ్డి గెలుపుకోసం పనిచేసే బాధ్యత నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా యాదృచ్చికంగా చేయలేదని.. బీజేపీ పార్టీ ఎక్కడ ఉంది అన్న వాళ్లకు ఈ నల్లగొండ ప్రజలు త్వరలో చూపిస్తారని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్టాన్ని సాధించుకున్నామో  అదంతా 8 సంవత్సరాల్లో కనుమరుగైపోయిందని.. తెలంగాణలో బాగుపడ్డది ఒక కేసీఆర్ కుటుంబమేనని పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని కేసీఆర్ చెప్పిండు.. కానీ జనం గుద్దుడు గుద్దితే కేసీఆర్ దిమ్మ తిరిగిందని గుర్తు చేశారు. 

కేసీఆర్ అహంకారాన్ని బొదపెట్టడానికే రాజీనామా ఉద్యమానికి శ్రీకారం

తెలంగాణ ఉద్యమాన్ని రగిలించడానికి ఆనాడు రాజీనామా ఉద్యమాన్నిఏవిధంగా రగిలించామో, ఇప్పుడు కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టడానికి మళ్లీ రాజీనామా ఉద్యమానికి శ్రీకారం చుట్టామని ఈటల రాజేందర్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ ని వచ్చే ఎన్నికలలో ఓడగొట్టడమే నా ధ్యేయం అన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం పోయేది ఉంటే ఆనాడు కాంగ్రెస్ నుంచి 12 మంది పోయినప్పుడే పొయ్యేవాడని పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ది దింపుడుకళ్లెం కాడి ఆశలాగా ఉందన్నారు. భారతదేశంలో జాతీయ పార్టీ పెడతానని అనుకుంటున్నావ్..  యూపీ, బీహార్ కి పొయ్యి సత్తా ఉందా కేసీఆర్ అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులంతా మునుగోడు ప్రజల వైపే ఉన్నారని.. ఆరు నూరైనా మునుగోడు ఎన్నికలలో బిజెపి గెలవడం ఖాయమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. 

రాజగోపాల్ రెడ్డి రాజీనామా త్యాగం.. ప్రజలకు లాభం

రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనేది ఒక త్యాగం.. ఈ రాజీనామా మునుగుడు ప్రజలకు లాభం మాత్రమే రాజగోపాల్ రెడ్డి కి కాదని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మునుగోడులో సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందితే అది రాజగోపాల్ రెడ్డి పుణ్యమే అవుతుందన్నారు. మునుగోడు ఎన్నికలలో బీజేపీ ఆయుధం క్రమశిక్షణ, నిజాయితీ అయితే.. టీఆర్ఎస్ కి అధికారం, పోలీసులు, డబ్బులు వంటి ఆయుధాలు ఉన్నాయని.. బీజేపీకి మునుగోడు ఎన్నిక సెమిఫైనల్ లాంటిదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.