
మెదక్ టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్రాజర్షి షా టీచర్లకు సూచించారు. మంగళవారం కలెక్టర్ ఆఫీసులో అధికారులు, టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సబ్జెక్ట్ టీచర్లు అందరూ కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా డీఈవో రాధాకిషన్ జిల్లావ్యాప్తంగా పదో తరగతిలో మంచి ఫలితాలు వచ్చేందుకు చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారులు విజయలక్ష్మి, శంకర్ నాయక్, మైనారిటీ సంక్షేమ అధికారి జెమ్లానాయక్, రవి ప్రసాద్, గోవింద్, కృష్ణయ్య, సుదర్శన మూర్తి పాల్గొన్నారు.
12న సింగూరు నీటి విడుదుల
యాసంగి పంటల అవసరాలకు సింగూరు నుంచి ఈనెల 12న నీరు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టర్ ఆఫీసులో నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి విడుదలతో మెదక్, హవేళీ ఘనపూర్, కొల్చారం , పాపన్నపేట మండలాల్లోని 21,625 ఎకరాలకు సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్ఈ యేసయ్య, ఈఈ శ్రీనివాస్ రావు, డీఈలు, ఏఈలు, నీటి పారుదల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
31 వరకు ధాన్యం మిల్లింగ్ చేయాలి
మెదక్ జిల్లాలోని అన్ని రైస్మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని ఈ నెల 31వరకు బియ్యంగా మార్చాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కలెక్టర్ ఆఫీసులో జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజూ వారి లక్ష్యాన్ని ఏర్పరచుకొని పనిచేయాలన్నారు. లక్ష్యం చేరుకోకపోతే వచ్చే సంవత్సర కేటాయింపు తగ్గుతుందని, వారిని బ్లాక్ లిస్టులో పెడతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీసీఎస్వో బ్రహ్మారావు, సివిల్ సప్లయి డీఎమ్ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.