
అదే నిర్లక్ష్యం.. అదే వైఫల్యం.. అదే చెత్త ప్రదర్శన.. ఫలితంగా టీమిండియా కల మరోసారి నెరవేరలేదు. రెండేళ్ల క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎలాంటి పరాభవాన్ని ఎదుర్కున్నామో.. మరోసారి అలాంటి సీన్ రిపీట్ అయ్యింది. చారిత్రాత్మక ఓవల్ వేదికపై టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలిసారి ఫైనల్ చేరిన ఆసీస్..ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 విజేతగా నిలిచింది.
444 పరుగుల భారీ లక్ష్యంతో చివరి రోజు ఆట ఆరంభించిన టీమిండియా తొలి సెషన్లోనే ఆలౌట్ అయ్యింది. 232 పరుగులకి ఆలౌట్ అయ్యి.., 210 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఆదుకుంటారనుకున్నా కోహ్లీ, రహానే.. అనవసరపు షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. 164/3 ఓవర్నైట్ స్కోర్తో ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, 13 పరుగులు మాత్రమే జోడించి కోహ్లీ(49) వికెట్ కోల్పోయింది. అదే ఓవర్లో జడేజా(0) కూడా వెనుదిరగడంతో టీమిండియా ఓటమి ఖాయమైంది.
ఇక పోరాడి లాభం లేదనుకున్న రహానే- శ్రీకర్ భరత్ జోడి నిర్లక్ష్యంగా ఆట కొనసాగించారు. రహానే(46), శార్దూల్ ఠాకూర్(0), ఉమేష్ యాదవ్(1), శ్రీకర్ భరత్(23), సిరాజ్(1) వెంటవెంటనే ఔట్ అవ్వడంతో టీమిండియా ఇన్నింగ్స్కి తెరపడింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ 4 వికెట్లు తీసుకోగా.. స్కాట్ బోలాండ్ 3, స్టార్క్ 2, కమ్మిన్స్ ఒక వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్లో అద్భుత బ్యాటింగ్తో రాణించిన ట్రావిస్ హెడ్(163)కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డ్ దక్కింది.