లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్లో ఇండియా మరోసారి తడబడింది. ఐపీఎల్ స్టార్లందరూ బ్యాటింగ్లో ఫెయిల్ కావడంతో... ఆదివారం ముగిసిన మెగా ఫైనల్లో ఆస్ట్రేలియా 209 రన్స్ భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. దీంతో అన్ని ఐసీసీ ట్రోఫీ (వన్డే వరల్డ్కప్స్ (1987, 1999, 2003, 2007, 2015), చాంపియన్స్ ట్రోఫీ (2006, 2009), టీ20 వరల్డ్కప్ (2021), 2023 వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్)లు నెగ్గిన తొలి టీమ్గా ఆసీస్ సరికొత్త రికార్డు సృష్టించింది. 444 రన్స్ ఛేదనలో ఓవర్నైట్ స్కోరు 164/3 స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్లో 63.3 ఓవర్లలో 234 రన్స్కు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (49), అజింక్యా రహానె (46) కాస్త పోరాడారు. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేసిన ఆసీస్ బౌలర్లు రోహిత్సేనను బెంబేలెత్తించారు. దీంతో ఇండియా ఏ దశలోనూ లక్ష్యాన్ని అందుకునేలా కనిపించలేదు. ట్రావిస్ హెడ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. విన్నర్ ఆస్ట్రేలియాకు రూ. 13 కోట్ల 22 లక్షలు, రన్నరప్ ఇండియాకు రూ. 6 కోట్ల 61 లక్షల ప్రైజ్మనీ లభించింది.
క్యూ కట్టిన్రు..
రెండేళ్ల కిందట న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇండియా ఈసారి అన్ని అస్త్రాలతో బరిలోకి దిగింది. కానీ టాస్ గెలవడం మినహా మిగతా అన్ని విషయాల్లో ఎదురుదెబ్బలే తగిలాయి. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్కు భారీ ఆధిక్యం ఇచ్చుకోవడంతో ఇండియా పతనం మొదలైంది. అయితే రెండో ఇన్నింగ్స్లోనైనా గట్టి పోటీ ఇస్తారని భావించినా టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఓటమిని తెచ్చిపెట్టింది. ఆఖరి రోజు 208 రన్స్ కావాల్సి ఉండగా, నాలుగో రోజు నిలకడగా ఆడిన ఓవర్నైట్ బ్యాటర్లు కోహ్లీ, రహానె భారీ స్కోరు చేస్తారని అనుకున్నారు. అయితే మార్నింగ్ సెషన్ ఏడో ఓవర్లోనే బోలాండ్ (3/46) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. మూడు బంతుల తేడాలో కోహ్లీ, జడేజా (0)ను ఔట్ చేసి షాకిచ్చాడు. రెండో ఎండ్లో నేథన్ లైయన్ స్పిన్ (4/41) మ్యాజిక్కు తోడుగా స్టార్క్ (2/77) వరుస విరామాల్లో మిగతా లైనప్ను దెబ్బకొట్టాడు. 57వ ఓవర్లో రహానెను స్టార్క్ పెవిలియన్కు పంపడంతో మ్యాచ్ ఇండియా చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. మధ్యలో తెలుగు బ్యాటర్ కేఎస్ భరత్ (23), మహ్మద్ షమీ (13 నాటౌట్) కాసేపు బ్యాట్లు అడ్డేసినా అవతలి వైపు శార్దూల్ ఠాకూర్ (0), ఉమేశ్ (1), సిరాజ్ (1) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఫలితంగా 70 రన్స్కే చివరి ఏడు వికెట్లు కోల్పోవడంతో ఇండియా ఓటమి ఖాయమైంది. దీంతో గదను అందుకునే అవకాశం రెండోసారి కూడా దూరమైంది.